వైసిపి అభ్యర్దులు ప్రకటన అప్పుడే : చేరికల తో మారుతున్న నిర్ణయాలు: బస్సు యాత్రకు జగన్
వైసిపి అధినేత జగన్ కీలక నిర్ణయం ప్రకటించారు. పార్టీలోకి అధికార పార్టీ నుండి వలసలు పెరుగుతున్న క్రమం.. అదే సమయంలో టిడిపి అభ్యర్దులు ఖరారు అవుతున్న వేళ..వైసిపి అభ్యర్దులు ప్రకటన విషయంలో జగన్ కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. అదే విధంగా..బస్సు యాత్రకు జగన్ సిద్దమని ప్రకటించారు.
అప్పుడే అభ్యర్దుల ఖరారు..
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ మరి కొద్ది రోజుల్లో విడుదల కానుంది. దీంతో..ఇప్పటికే టిడిపి తమ అభ్యర్దులను ఒక్కో జిల్లా వారీగా ఖరారు చేస్తోంది. సహజంగా టిడిపి నామినేషన్ల చివరి నిమిషం వరకు అభ్యర్దులను ప్రకటించదు. ఈ సారి ట్రెండ్ మార్చింది. లోక్సభ నియోజకవర్గాల వారీగా అభ్యర్దులను ఖరారు చేస్తున్నారు. ఇదే సమయంలో వైసిపి మాత్రం వ్యూహాత్మకం వేచి చూసే ధోరణి అమలు చేస్తోంది. వైసిపి నేతలతో పార్టీ అధినేత జగన్ కీలక సమావేశం ఏర్పా టు చేసారు. అందులో అభ్యర్దుల ప్రకటన పై చర్చకు వచ్చింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే ఒకటి రెండు రోజుల్లోనే అభ్యర్దులను ఖరారు చేస్తామని జగన్ స్పష్టం చేసారు.
చేరికలు పూర్తి కాగానే..
ఎన్నికల షెడ్యూల్ మార్చి 3 లేదా 5 న విడుదల అయ్యే అవకాశం ఉందని సమాచారం. మార్చి ఒకటిన జగన్ ఢిల్లీ వెళ్తున్నారు. 2న అక్కడ ఇండియా టుడే కార్యక్రమంలో పాల్గొంటారు. దీంతో..2వ తేదీ సాయంత్రం..3వ తేదీన వైసిపి లో కీలక నేతల చేరికలు ఉంటాయని పార్టీ నేతలు చెబుతున్నారు. ఆ తరువాత ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉంది. ఆ వెంటనే ఒకటి రెండు రోజుల్లోనే మొత్తంగా అభ్యర్దుల లిస్టు ప్రకటించాలనేది జగన్ వ్యూహం గా కని పిస్తోంది. ఇదే సమయంలో టిడిపి నుండి పోటీ చేసే అభ్యర్దుల పైనా స్పష్టత వస్తుంది. టిడిపి అభ్యర్దులను దృష్టిలో పెట్టుకొని..అక్కడి సమీకరణాలకు అనుగుణంగా వైసిపి తమ అభ్యర్దులను ప్రకటించాలని భావిస్తోంది.
బస్సు యాత్రకు సిద్దమే..
ఇక, ఏపిలోని 25 లోక్సభ స్థానాలకు రెండేసి నియోజకవర్గాలకు ఒక పరిశీలకుడిని నియమిస్తూ జగన్ నిర్ణయించారు. వీరు ఆ రెండు లోక్సభ స్థానాల పరిధిలోని అసెంబ్లీ అభ్యర్దలు ఏ రకంగా ఎన్నికలకు సమాయత్తం అవుతుందీ..అదే విధంగా వారికి సూచనలు..పార్టీ పరంగా సహకారం..స్థానికంగా సమన్వయం వంటి అంశాల పై దృష్టి పెడతారు. దీంతో పాటుగా..పాదయాత్ర లో కవర్ కాని నియోకవర్గాల్లో బస్సు యాత్ర చేయాలని జగన్ నిర్ణయించారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తరువాత బస్సు యాత్ర చేస్తానని..ఎన్నికలకు ప్రతీ నియోజకవర్గంలో సమన్వయకర్తలు బాధ్యతలు తీసుకోవా లని జగన్ ఆదేశించారు.