సుబ్బారెడ్డి..గౌరు..ఆళ్ల.. ఎవరు దూరమైనా డోన్ట్ కేర్: జగన్ ఏం చెబుతున్నారు: 2014 ఫలితాల ఎఫెక్ట్
ఒకవైపు ఎన్నికల టెన్షన్. ఇదే సమయంలో జగన్ కు విధేయులుగా ఉన్న వారు దూరం అవుతున్నారు. కీలకమైన వ్యక్తులుగా పార్టీలో గుర్తింపు ఉన్న వీరు ఒక్కొక్కరుగా బయట పడుతున్నారు. జగన్ పై వారు విమర్శలు చేయకున్నా.. ఇలాంటి కీలక నేతల విషయంలో ఏం జరుగుతోంది. జగన్ ఎందుకు ఇంత కఠినంగా ఉంటున్నారు...
సీట్లు లేవనటంతో..కీలక నేతలు ఇలా..
వైసిపి లో కీలక నేతలకు సైతం జగన్ టిక్కెట్ల విషయంలో ఎటువంటి మోహమాటాలకు అవకాశం ఇవ్వటం లేదు. పార్టీ ఏర్పాటు నుండి తమ కుటుంబంతోనే ఉన్న ఒంగోలు ఎంపి సుబ్బారెడ్డికి ఈ సారి సీటు ఇవ్వలేనని జగన్ స్పష్టం చేసారు. పార్టీ అధికారంలోకి రాగానే ప్రాధాన్యత ఉంటుందని..అధికారంలోకి వచ్చే విధంగా పార్టీకి సేవలు అందించా లని సూచించారు. అయినా సుబ్బారెడ్డి అలిగారు. కొద్ది రోజులుగా జగన్ కు దూరంగా ఉంటున్నారు. ఇక, గౌరు దంపతు లకు ఈ సారి పాణ్యం సీటు ఇవ్వలేనని..అక్కడ కాటసాని రాంభూపాల్ రెడ్డికి సీటు ఇచ్చి..గౌరు కుటుంబానికి ఎమ్మెల్సీ ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. కానీ, వారు సంతృప్తి పడలేదు. పార్టీ వీడి టిడిపిలో చేరుతున్నారు. ఇంకా, కొన్ని చోట్ల ప్రస్తుతం ఉన్న సమన్వయకర్తల స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు. ఈ సమయంలో మరి కొంత మంది అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉంది.
ఆళ్ల రామకృష్ణా రెడ్డి సైతం..
క, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. టిడిపి ప్రభుత్వం పైనా..ముఖ్య మంత్రి పైనా కేసులు వేసి న్యాయ పోరాటాలు చేసారు. సదావర్తి భూముల వ్యవహారం లో కోర్టులకు పెద్ద మొత్తం లో డిపాజిట్ సైతం కట్టారు. ముఖ్యమంత్రి పై ఉన్న ఓటుకు నోటు వ్యవహారంలో సుప్రీం కోర్టు వరకు వెళ్లారు. రాజధాని భూముల వ్యవహారంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులతో కలిసి పోరాటం చేసారు. అయితే, ఈ సారి ఆయనకు మంగళగిరి టిక్కెట్ ఇవ్వలేనని జగన్ స్పష్టం చేసారు. ఈ సారి మంగళగిరి నుండి అక్కడ ఎక్కువగా ఉండే చేనేత వర్గానికి టిక్కెట్ ఇవ్వాల్సి ఉందని..అందు కోసం సహకరించాలని జగన్ నేరుగా ఆళ్ల రామకృష్ణారెడ్డిని కోరారు. ఆయన అయిష్టంగానే సరే అన్నారు. కానీ, ఆ నిర్ణయం తరువాత ఆర్కే పార్టీ నేతలకు సైతం అందుబాటులోకి రావటం లేదు. ఆయన అజ్ఞాతం లో ఉన్నారు.
2014 ఫలితాల ఎఫెక్ట్..
పార్టీకి..జగన్ కు తొలి నుండి విదేయులుగా ఉన్న వారి విషయంలోనూ జగన్ ఎందుకిలా వ్యవహరిస్తున్నారనే చర్చ ఇప్పుడు పార్టీలో మొదలైంది. అయితే, జగన్ మాత్రం 2014 లో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా ఈ సారి పక్కా గా ముందుకు వెళ్లాలని జగన్ నిర్ణయించారు. దీంతో..బంధుత్వాలకు..రికమండేషన్లకు ప్రాధాన్యత ఇవ్వటం లేదు. పికె టీం చేసిన సర్వేలు..తాను స్వతంత్ర సంస్థలతో చేయించుకున్న సర్వేలు..సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని జగన్ టిక్కెట్ల ఖరారు విషయంలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. తొలుత టిక్కెట్ ఇవ్వని వారికి నచ్చ చెప్పే రీతిలో వ్యవహరిస్తున్నారు. వారు సహకరించకపోతే..పార్టీ వీడుతున్నామని చెప్పినా జగన్ పెద్దగా స్పందించ టం లేదు. ఈ సారి అవకాశం మిస్ కాకూడదని జగన్ ముఖ్య నేతలతో చెబుతున్నారు. దీని కారణంగానే జగన్ కఠినం గా వ్యవహరిస్తున్నారని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు.