తనయుడికి బదులు తండ్రి! వైఎస్ఆర్ సీపీ పర్చూరు అభ్యర్థిత్వంలో అనూహ్య మార్పు
ఒంగోలు: ప్రకాశం జిల్లా పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిత్వంలో హఠాత్తుగా మార్పులు, చేర్పులు చోటు చేసుకున్నాయి. మరి కొద్దిసేపట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 25 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితా విడుదల చేయబోతున్న సమయంలో.. ఈ మార్పు చోటు చేసుకుంది. పర్చూరు అసెంబ్లీ ఎన్నికల బరిలో మొదట దగ్గుబాటి హితేష్ ను బరిలో దింపాలని భావించారు. దీనికోసం ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి.
1000 కోట్ల మోసం చేసిన ఈ బిజ్ ... ఓ మాయదారి కుటుంబం దోపిడీ చూస్తే షాక్ అవుతారు
హితేష్ కూడా నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను చేపట్టారు. అనూహ్యంగా హితేష్ స్థానంలో ఆయన తండ్రి, రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడిగానే పేరున్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు పేరు తెరపైకి వచ్చింది. హితేష్ కు బదులగా వెంకటేశ్వరరావు అభ్యర్థిత్వాన్ని వైఎస్ జగన్ ఖరారు చేసినట్లు చెబుతున్నారు. పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును ఢీ కొట్టడానికి వెంకటేశ్వరరావే సరైన అభ్యర్థి అని వైఎస్ఆర్ సీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. ప్రకాశం జిల్లా నుంచి కూడా తెప్పించుకున్న సర్వే నివేదికల్లో కూడా ఈ విషయమే తేలినట్లు స్పష్టమైంది.
హితేష్ కంటే కూడా ఆయన తండ్రిని అభ్యర్థిగా నిలబెట్టి, గెలిపించుకోగలిగితే.. అసెంబ్లీలోనూ జగన్ కు సహాయకారిగా ఉంటారనే అభిప్రాయం ఉన్నట్లు తెలుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. వెంకటేశ్వరరావును మంత్రివర్గంలో చోటు దక్కడం ఖాయమని కూడా చెబుతున్నారు.
దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ జాతీయ మహిళా అధ్యక్షురాలు పురంధేశ్వరి భర్త. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు స్వయానా తోడల్లుడు. ఆయన గుట్టమట్లు అన్నీ వెంకటేశ్వరరావుకు తెలుసనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఎన్టీ రామారావును పదవీచ్యుతుడిని చేయడానికి చంద్రబాబు చేసిన కుట్రలపై వెంకటేశ్వరరావు ఇదివరకే ఓ పుస్తకాన్ని కూడా ముద్రించారు.
అలాంటి నాయకుడిని అసెంబ్లీలో చోటు కల్పిస్తే.. వ్యూహ, ప్రతివ్యూహాలను రచించడంలో ఆయన అనుభవాన్ని వినియోగించుకోవచ్చని వైఎస్ఆర్ సీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. దీనితో హితేష్ స్థానంలో వెంకటేశ్వరరావు పేరును తెరమీదికి తీసుకొచ్చారు. కాగా, హితేష్ ను శాసన మండలికి ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం.