కోర్టులు వదిలేసినా వరద పోటు తప్పదుగా... చంద్రబాబూ ఇల్లు ఖాళీ చేయండన్న సజ్జల...
విజయవాడ వద్ద కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. విజయవాడ వద్ద కృష్ణానది ఉగ్రరూపంతో ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజీకి దిగువ ప్రాంతాలతో పాటు ఎగువన ఉన్న అమరావతి గ్రామాలను కూడా అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.
కృష్ణానది వరద నేపథ్యంలో ఉండవల్లి కరకట్టపై ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు అద్దెకు తీసుకున్న ఇల్లు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ ఇంటిని ఖాళీ చేయాలని ఎప్పటి నుంచో చంద్రబాబును వైసీపీ నేతలు కోరుతున్నారు. గతేడాది కృష్ణానది వరద నేపథ్యంలో ఇల్లు ఖాళీ చేయాలని చంద్రబాబును ప్రభుత్వం కోరినా ఆయన పట్టించుకోలేదు. ఆ తర్వాత అది కాస్తా మునగడంతో ప్రభుత్వం కావాలనే బ్యారేజీ వద్ద బోట్లు అడ్డుపెట్టి వరద ఆపి తన ఇంటని ముంచేసిందని ఆరోపించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఇంటివద్ద తీసిన డ్రోన్ కెమెరా విజువల్స్ కూడా వివాదాస్పదమయ్యాయి.
ఈ నేపథ్యంలో మరోసారి కృష్ణానదికి వచ్చిన వరదతో మరోసారి రాజకీయాలు మొదలయ్యాయి. చంద్రబాబును ఈసారైనా ఇల్లు ఖాళీ చేయాలని వైసీపీ నేత సజ్జల డిమాండ్ చేశారు. కృష్ణానదికి వరద వస్తోంది. ఇకనైనా మీరు చట్టాన్ని గౌరవించి ఉండవల్లిలో అక్రమంగా కట్టిన గెస్ట్ హౌస్ను ఖాళీ చేయండి అంటూ సజ్జల ట్వీట్ చేశారు. కోర్టుల ద్వారా రక్షణ పొందినా, ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని చూసినా పై నుంచి వచ్చిన వరద మీ ఇంటిని ముంచేయక మానదు కదా అంటూ సజ్జల ట్వీట్లో పేర్కొన్నారు.