ఆ రెండు స్థానాలపై కిరికిరి.. న్యాయపోరాటానికి వైసీపీ రెడీ
Recommended Video
అమరావతి : వైసీపీ న్యాయపోరాటానికి సిద్ధమవుతోంది. గుంటూరు, శ్రీకాకుళం లోక్సభ ఎన్నికల ఫలితాల ప్రకటనపై ఆ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ రెండు చోట్ల కూడా పూర్తిగా ఓట్లను లెక్కించకుండా రిటర్నింగ్ అధికారులు తొందరపడి ఫలితాలు వెల్లడించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈసీ నిబంధనలు తుంగలో తొక్కి టీడీపీ అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరించారని మండిపడుతున్నారు. ఆ మేరకు గుంటూరు నుంచి పోటీచేసిన వైసీపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు.
గుంటూరు నుంచి టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్ పోటీచేశారు. ఆయన వైసీపీ అభ్యర్థి మోదుగులపై 4వేల పైచిలుకు స్వల్ప ఆధిక్యతతో గెలుపొందారు. అయితే ఆ స్థానంలో 9 వేల 700 పైచిలుకు పోస్టల్ బ్యాలెట్లను లెక్కించకుండా అధికారులు తిరస్కరించారనేది మోదుగుల ప్రధాన ఆరోపణ. అందుకే రిజల్ట్ తారుమారైందని అంటున్నారు.
అక్కడ ఆమె గెలిచి బీజేపీకి అధికారం.. ఇక్కడ ఈయన గెలిచి టీడీపీ పవర్ ఖతం
రిటర్నింగ్ అధికారులు టీడీపీకి వత్తాసు పలికారని, పూర్తిస్థాయిలో వారికి సహకరించారని మోదుగుల ఆరోపిస్తున్నారు. 14 వేల పైచిలుకు నమోదైన పోస్టల్ బ్యాలెట్లలో కేవలం 4 వేల 600 పైచిలుకు ఓట్లను మాత్రమే లెక్కించారని అంటున్నారు. వాటిలో మోదుగులకు దాదాపు 3 వేల ఓట్లు రాగా, గల్లా జయదేవ్ కు 12 వందల పైచిలుకు వచ్చినట్లు చెబుతున్నారు. మిగతా 9 వేల 700 పోస్టల్ ఓట్లను తిరస్కరించినట్లు తెలిపారు.
అదలావుంటే శ్రీకాకుళం స్థానంలో టీడీపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు 6 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందినట్లు ప్రకటించారు. అయితే అక్కడ కూడా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎక్కువగా ఉన్నాయని.. వాటని పరిగణనలోకి తీసుకోకపోవడం వల్లే అన్యాయం జరిగిందని వైసీపీ నేతలు అంటున్నారు. ఆ మేరకు ఆ రెండు స్థానాలకు సంబంధించి జగన్కు వివరించినట్లు తెలుస్తోంది. మొత్తానికి పోస్టల్ బ్యాలెట్ అంశాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు.