దారుణం.. కరోనా పేషెంట్ను నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిన 108 సిబ్బంది...
కరోనా పేషెంట్ల పట్ల వివక్ష తగదని స్వయంగా ముఖ్యమంత్రి జగన్ పదేపదే చెప్తున్నప్పటికీ కొన్నిచోట్ల అమానవీయ ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా అనంతపురం జిల్లాలో ఓ కరోనా పేషెంట్ను 108 అంబులెన్స్ సిబ్బంది నడిరోడ్డుపై వదిలేసి వెళ్లారు. దీంతో చేసేది లేక కుటుంబ సభ్యులు వచ్చి అతన్ని ఇంటికి తీసుకెళ్లారు.
వివరాల్లోకి వెళ్తే... అనంతపురం జిల్లా మడకశిర మండలం గుండుమల పంచాయతీ పీఎస్ తాండాకు చెందిన గోపినాయక్(61) ఇటీవల కరోనా బారినపడ్డాడు. దీంతో అతన్ని అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. కరోనా వార్డులో అతనికి చికిత్స అందిస్తూ వస్తున్నారు. అయితే చికిత్స అందిస్తున్నప్పటికీ... అతను కోలుకోకపోవడంతో శుక్రవారం(జూలై 31) రాత్రి 108 అంబులెన్సులో ఇంటికి పంపించారు.
ఈ క్రమంలో అంబులెన్స్ సిబ్బంది అతన్ని ఇంటి వరకూ చేర్చకుండా మార్గమధ్యలోనే నడిరోడ్డుపై దింపేసి వెళ్లిపోయారు.రోడ్డు పక్కన అచేతన స్థితిలో ఉన్న అతన్ని స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకుని గోపీనాయక్ని ఇంటికి తీసుకెళ్లారు. కరోనా పేషెంట్ను ఇలా నడిరోడ్డుపై వదిలి వెళ్లడం పట్ల స్థానికులు,కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.