ఏపీలో ఎమ్మార్వోకు కరోనా పాజిటివ్: సిబ్బందితోపాటు ఎమ్మెల్యే కూడా క్వారంటైన్లోకి!
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనాకేసులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 473 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు, కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఒక్క గుంటూరు జిల్లాలోనే వందకుపైగా కేసులు నమోదు కావడం గమనార్హం. ఆ తర్వాత కర్నూలు జిల్లాలో ఎక్కువ కేసులు నమోదయ్యాయి.
ఎమ్మార్వోకు కరోనా పాజిటివ్..
తాజాగా, అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని ఓ తహసీల్దార్కు కరోనా పాజిటివ్ అని తేలింది. తహసీల్దార్కు కరోనా సోకినట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. అనారోగ్యంతో గత కొన్ని రోజులుగా విధులకు హాజరుకాకపోవడంతో అతని నమూనాలను సేకరించి పరీక్షలకు పంపగా కరోనా సోకినట్లు నిర్ధరించారు. అనంతరం హిందూపురంలో నివసిస్తున్న సదరు ఎమ్మార్వోను అనంతపురంలోని కరోనా ఆస్పత్రికి తరలించారు. కాగా, ఎమ్మార్వోకు కరోనా పాజిటివ్ రావడంతో ఆయనను కలిసిన ఉద్యోగులు, రాజకీయ నాయకుల్లో కలవరం మొదలైంది.
సిబ్బందితోపాటు ఎమ్మెల్యే కూడా క్వారంటైన్లోకి..
ఈ క్రమంలో ఎమ్మార్వో, ఎంపీడీవో కార్యాలయాల సిబ్బంది వివరాలు సేకరించి వారిని కూడా క్వారంటైన్కు పంపారు అధికారులు. కరోనా నివారణకు తీసుకున్న చర్యలపై ఇటీవల మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి నిర్వహించిన సమీక్ష సమావేశానికి కూడా సదరు తహసీల్దారు హాజరైనట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆ ఎమ్మెల్యేను కూడా క్వారంటైన్లో ఉంచారు.
పెరుగుతున్న కరోనాకేసులు..
కాగా, ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగిపోతోంది. మంగళవారం ఉదయం వరకు 34 కొత్త కేసులు నమోదు కావడంతో కరోనా పాజిటివ్ కేసులు 473కు చేరాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 9 మంది ప్రాణాలు కోల్పోయారు. 14 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గుంటూరు, కర్నూలు జిల్లాలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రతి ఆస్పత్రిలో ఐసోలేషన్ సదుపాయం ఉండాలని, వైద్య సిబ్బందికి మాస్కులు, పీపీఈలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు సీఎం జగన్.