దివాకర్ రెడ్డి మాజీ పీఏ ఇంటిపై ఏసీబీ దాడులు: రూ. 3 కోట్ల ఆస్తులు గుర్తింపు..!
టీడీపీ నేత..మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాజీ పీఏ సురేష్ రెడ్డి ఇంటిపై ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. చాలా కాలంగా ఆయన జేసీ దివాకర్ రెడ్డి పీఏగా పని చేసారు. సోదాల్లో 3 కోట్ల రూపాయల ఆస్తులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. పంచాయతీ రాజ్ శాఖ లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న సురేష్ రెడ్డి..చాలాకాలంగా జేసీ దివాకర్ రెడ్డి పీఏగా పనిచేసారు. జేసీ దివాకర్ రెడ్డి పదవిలో ఉన్నా.. లేకపోయినా సేవలు అందిస్తున్నారని సురేష్ మీద ఫిర్యాదులు ఉన్నాయి.
జేసీ దివాకర్ రెడ్డికి మరోసారి షాక్...!
ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని ఏఈఈ సురేష్ రెడ్డి పై ఆరోపణలు రావటంతోనే ఈ దాడులు చేస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. జేసీ దివాకర్ రెడ్డి ని అడ్డంపెట్టుకుని ఏఈఈ సురేష్ రెడ్డి అక్రమాస్తులు కూడబెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయనతో పాటుగా అనంతపురం, పుట్టపర్తి, బేతంచర్ల ప్రాంతాల్లో సురేష్ రెడ్డి కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్ల పై ఏసీబీ దాడులు కొనసాగిస్తోంది. ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది.
అనంతపురంలో ఉంటున్న పంచాయతీ రాజ్ శాఖ లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న సురేష్ రెడ్డి ఇంటి పైన ఏసీబీ దాడులు చేసింది. ఆయన అక్రమంగా కోట్లాది రూపాయాల ఆస్తులు కూడ బెట్టినట్లు గుర్తించారు. ఆయనకు జిల్లాలో బహుళ అంతస్థుల భవనాలు ఉన్నట్లు తేల్చారు. ఇంట్లో పెద్ద ఎత్తున నగదు..బంగారం స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి కలెక్టర్లు.. ఎస్పీలతో వీడియో కాన్ఫిరెన్స్ లో ఏసీబీ దాడులు పెద్ద ఎత్తున జరుగుతాయని..ప్రత్యేకంగా టీంలను ఏర్పాటు చేసామని వెల్లడించారు.
రాజకీయంగా అవినీతి తగ్గుముఖం పట్టినా.. అధికారిక వ్యవస్థలో మాత్రం ఇంకా అవినీతి పూర్తిగా తగ్గలేదని సీఎం అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో ఏసీబీ రాష్ట్ర వ్యాప్తంగా అవినీతికి పాల్పడుతున్నవారి వివరాలు సేకరించినట్లుగా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఎంపీగా పని చేసిన జేసీ దివాకర్ రెడ్డి వద్ద పీఏగా పని చేసిన సమయంలో ఆయన పెద్ద ఎత్తున ఆస్తులు సంపాదించానే అభియోగాలు ఉన్నాయి. దీంతో..ఇప్పుడు ఏసీబీ దాడులు అధికారిక వర్గాల్లోనే కాకుండా..రాజకీయంగా హాట్ టాపిక్ గా మారాయి.