తావీజ్ మహిమ: ఇంటర్ పాస్ కోసం గోడ దూకబోయిన విద్యార్థిని
అనంతపురం: పరీక్షల్లో మంచి మార్కులతో పాస్ కావడానికి ఎవరైనా ఏం చేస్తారు? పుస్తకాలు ముందరేసుకుని కుస్తీ పడతారు. రేయింబవళ్లు చదువుకుంటారు. దేవుడి మీద కూడా భారం వేస్తారు. గుళ్లూ, గోపురాలకు వెళ్తారు. కాస్త తెలివి అతిగా ఉన్న విద్యార్థులు ఓవర్ గా యాక్ట్ చేస్తారు. స్లిప్పుల మీద ఆధారపడతారు. ఇది సాధారణంగా జరిగే తంతు. మనకు తెలిసిన వ్యవహారం. ఓ విద్యార్థిని అందరి కంటే కాస్త డిఫరెంట్ గా ఆలోచించింది. చిలక జోస్యం మీద డిపెండ్ అయ్యింది. దీని ఫలితం- చేతి చమురు వదిలించుకోవడమే. పరీక్షల గండం నుంచి తాను గట్టెక్కడానికి తావీజ్ మహిమే దిక్కనుకున్న ఆ విద్యార్థిని చిలక జ్యోతిష్కుడికి ఏకంగా 40 వేల రూపాయలను ఇవ్వబోతూ ఇంట్లో వాళ్లకు రెడ్ హ్యాండెడ్ గా దొరికింది. ఆసక్తికరమైన ఈ ఘటన అనంతపురంలో చోటు చేసుకుంది.
అనంతపురానికి చెందిన ఓ విద్యార్థిని ఇంటర్మీడియట్ చదువుతోంది. వార్షిక పరీక్షలను రాయడానికి సిద్ధపడుతోంది. మరో నెల-నెలరోజుల్లో పరీక్షలు. సరిగ్గా చదువుకోవట్లేదేమో? పరీక్షల టెన్షన్ పట్టుకుంది. స్థానిక కళాశాల వద్ద, ఫుట్ పాత్ పై తిష్ఠ వేసిన ఓ చిలక జోతిష్కుడు ఆమె అవస్థను గమనించాడు. తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. ఆమె ఇబ్బందుల నుంచి డబ్బులు పిండుకోవాలని యోచించాడు. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న ఆ విద్యార్థిని పిలిచి, మాయమాటలతో బురిడీ కొట్టించాడు. పరీక్షల్లో గట్టెక్కాలంటే చదువు ఒక్కటే సరిపోదని, తాను తాయత్తు ఇస్తానని నమ్మించాడు. తాయత్తును కట్టుకుంటే ఇంటర్మీడియట్ పరీక్షల్లో పాసైపోతావని నమ్మించాడు.
అతగాడి మాయ మాటలను ఆ విద్యార్థిని విశ్వసించింది. తాయత్తు కట్టుకోవడానికి సిద్ఢపడింది. తాయత్తు 50 వేల రూపాయలని చెప్పాడు. ఈ మొత్తంపై ఆ విద్యార్థిని బేరంపెట్టింది. తాను అంత మొత్తాన్ని కట్టలేనని, తగ్గించాలని కోరగా.. 40 వేల రూపాయలకు ఓకే చేశాడు. నాలుగు దఫాలుగా ఈ మొత్తాన్ని కట్టేలా మాట్లాడుకున్నాడు. తొలి దఫా కింద ఆ విద్యార్థిని తన మెడలో ఉన్న బంగారు గొలుసును 10 వేల రూపాయలకు విక్రయించింది. ఆ మొత్తాన్ని చిలక జ్యోతిష్కుడి చేతిలో పెట్టింది. సెకెండ్ ఇన్ స్టాల్ మెంట్ కోసం ఆ విద్యార్థిని ఏకంగా ఇంట్లోనే దొంగతనానికి పాల్పడింది.
తల్లిదండ్రులు ఇంట్లో దాచిన 5000 రూపాయలను చోరీ చేసింది. ఆ మొత్తాన్ని తీసుకుంటుండగా, తల్లిదండ్రులు గుర్తించారు. దీనితో భయపడిన ఆమె దాన్ని ఇంటి గోడకు అవతల విసిరేసింది. ఆ తరువాత ఎవరూ చూడకపోవడంతో డబ్బును తీసుకోవడానికి గోడ దూకబోయింది. అదే సమయంలో ఆమెను గమనించిన తల్లిదండ్రులు ప్రశ్నించారు. దీనితో ఆసలు విషయం వెలుగు చూసింది. బాధిత విద్యార్థిని ఇచ్చిన వివరాల ఆధారంగా తల్లిదండ్రులు, వారి బంధువులు..ఫుట్ పాత్ పై లెక్కలేసుకుంటూ కూర్చున్న జ్యోతిష్కుడిని పట్టుకున్నారు. రోడ్డుపైనే అతడి చొక్కా పట్టుకుని నిలదీశారు. వాళ్ల గొడవను చూసిన పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొన్నారు. తమకు కేసు వద్దని, జ్యోతిష్కుడి నుంచి డబ్బులు ఇప్పించాలని తల్లిదండ్రులు పోలీసులను కోరారు. పోలీసులు తమదైన శైలిలో వార్నింగ్ ఇవ్వడంతో ఆ జ్యోతిష్కుడు విద్యార్థిని నుంచి తీసుకొన్న డబ్బులను వెనక్కి ఇచ్చేశాడు. అనంతరం పోలీసులు.. ఆ విద్యార్థినికి హితబోధ చేశారు. పరీక్షల్లో పాస్ కావడానికి కష్టపడి చదువుకోవాలని సూచించారు. ఇలాంటి చిలక జ్యోతిష్కులు, మంత్రగాళ్ల మాయమాటల్లో పడొద్దని సూచించారు.