డేంజరస్ మౌంట్ కిలిమంజారోపై జెండా పాతిన అనంతపురం బాలిక: తెలంగాణలో ట్రైనింగ్
అనంతపురం: మౌంట్ కిలిమంజారో.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన పర్వతశ్రేణుల్లో ఒకటి. అదే స్థాయిలో ప్రమాదకరమైనది కూడా. నిద్రాణమైన అగ్నిపర్వతం ఇది. ఆఫ్రికాలోని టాంజానియాలో ఉండే ఈ పర్వత శిఖరాగ్రంపై క్షణక్షణానికి వాతావరణం మారుపోతుంటుంది. మంచుతో కప్పి ఉండే ఈ పర్వతం ప్రధాన శిఖరం కిబోను అందుకోవాలంటే 5,885 మీటర్లను అధిగమించాల్సి ఉంటుంది. లక్ష్యాన్ని చేరే క్రమంలో ప్రమాదకరమైన వాతావరణ పరిస్థితులు, బలమైన ఈదురుగాలులను ఎదుర్కొని నిల్చోవాల్సి ఉంటుంది. అలాంటి సంక్లిష్టమైన యాత్రను విజయవంతంగా చేశారు అనంతపురం జిల్లాకు చెందిన బాలిక.
ఆ బాలిక పేరు రిత్విక శ్రీ. వయస్సు తొమ్మిది సంవత్సరాలు. అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం ఎం అగ్రహారంలో నివాసం ఉంటోన్నారు. అనంతపురంలోని సెయింట్ విన్సెంట్ డె పాల్ ఇంగ్లీష్ మీడియంలో స్కూల్లో చదువుకుంటున్నారు. కిందటి నెల 26వ తేదీన ఆ బాలిక కిలిమంజారోను అధిరోహించారు. ఈ పర్వత శిఖరాగ్రంపై జెండా పాతారు. జాతీయ పతాకాన్ని, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని ముద్రించిన జెండాను ఎగురవేశారు.
అత్యంత దుర్లభమైన మౌంట్ కిలిమంజారోను అధిరోహించిన ప్రపంచంలోనే రెండో అతిపిన్న వయస్సున్న బాలికగా రిత్విక శ్రీ రికార్డు నెలకొల్పారు. ఆసియా దేశాల నుంచి ఈ ఘనతను సాధించిన తొలి పిన్న వయస్సున్న బాలిక ఆమెనే. రిత్విక శ్రీ తండ్రి జిల్లా శంకర్..జిల్లా స్థాయిలో క్రికెట్ కోచ్గా పనిచేస్తోన్నారు. స్పెషల్ ఒలింపిక్స్ భారత్కు ఆర్డీటీ తరఫున స్పోర్ట్స్ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తోన్నారు. కిలిమంజారోను అధిరోహించడానికి అవసరమైన శిక్షణను ఆమె తెలంగాణలోని భువనగిరిలో తీసుకున్నారు. భువనగిరి కోటను ఆధారంగా చేసుకుని రాక్ క్లైంబింగ్లో నైపుణ్యాన్ని సాధించారు. ఇది లెవెల్-1 శిక్షణ. అనంతరం హిమాచల్ ప్రదేశ్లోని మనాలీలో లెవెల్-2 శిక్షణ పొందారు.
తాజాగా బాలిక.. అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడిని కలిశారు. తాను సాధించిన ప్రశంసాపత్రాన్ని ఆయనకు చూపించారు. మౌంటెనీరింగ్లో బాలికా విద్యను ప్రోత్సహించడానికి కలెక్టర్ ఆమెకు 2.98 లక్షల రూపాయలను మంజూరు చేశారు. టాంజానియా వెళ్లడానికి అవసరమైన ఛార్జీలు, నివాస వసతి కోసం అధికారులు ఈ మొత్తాన్ని ఖర్చు చేశారు. కెన్యా సరిహద్దుల్లో ఉన్న టాంజానియా ఈశాన్య భాగంపై ఎడతెగకుండా అధిరోహించడానికి అవసరమైన సామాగ్రి,ఇతర శిక్షణ పనుల కోసం ప్రభుత్వం ఈ మొత్తాన్ని విడుదల చేసింది.