అనంత కలెక్టర్ను కదిలించిన ఫేస్బుక్ పోస్ట్: 24 గంటల్లోనే బస్సు: స్టూడెంట్స్తో కలిసి ప్రయాణం
అనంతపురం: బ్రహ్మసముద్రం.. అనంతపురం జిల్లాలో మారుమూల ఉండే మండల కేంద్రం ఇది. కర్ణాటక సరిహద్దులకు ఆనుకుని ఉంటుంది. ఉన్నత పాఠశాల సౌకర్యం ఉన్న మండల కేంద్రం కావడంతో చుట్టుపక్కల ఉన్న గ్రామాల విద్యార్థులు చదువుకోవాలంటే బ్రహ్మసముద్రానికి రావాల్సిందే. గొంచిరెడ్డి పల్లి, నాగిరెడ్డి పల్లి వంటి గ్రామాల నుంచి పలువురు విద్యార్థులు బ్రహ్మసముద్రానికి చేరుకోవడానికి ఎలాంటి బస్సు వసతి లేదు. కాలినడకన లేదా షేర్ ఆటోల మీద ఆధారపడి వారు తమ గ్రామాల నుంచి ఉన్నత పాఠశాలకు రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి ఉండేది.
తమ దుస్థితిని వివరిస్తూ గొంచిరెడ్డిపల్లి, నాగిరెడ్డి పల్లి గ్రామాలకు చెందిన కొందరు విద్యార్థినులు సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. గొంచిరెడ్డిపల్లి, నాగిరెడ్డిపలి గ్రామాలకు చెందిన తాము బ్రహ్మసముద్రంలో ఉన్న ఉన్నత పాఠశాలను చేరుకోవడానికి రోజూ 10 కిలోమీటర్ల దూరం నడుస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఇబ్బంది నుంచి గట్టెక్కించాలని, ఆర్టీసీ బస్సును నడింపించేలా ఆర్టీసీ అధికారులను ఆదేశించాలంటూ జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడుకు విజ్ఞప్తి చేశారు.
అనంత కలెక్టర్ను కదిలించిన ఫేస్బుక్ పోస్ట్: 24 గంటల్లోనే బస్సు pic.twitter.com/ozSSJ5jSBy
— oneindiatelugu (@oneindiatelugu) January 22, 2021
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో తన దృష్టికి వచ్చిన వెంటనే గంధం చంద్రుడు స్పందించారు. ఆర్టీసీ అనంతపురం రీజనల్ మేనేజర్ను సంప్రదించారు. వెంటనే బస్సును ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించారు. సమీపంలోని కళ్యాణదుర్గం ఆర్టీసీ డిపో నుంచి బస్సు సౌకర్యాన్ని కల్పించారు..ఈ ఉదయం ఆయన బస్సును లాంఛనంగా ప్రారంభించారు. దీనికోసం గంధం చంద్రుడు గొంచిరెడ్డి పల్లికి వెళ్లారు.
బస్సును ప్రారంభించిన తరువాత.. అదే బస్సులో ఆయన గొంచిరెడ్డి పల్లి, నాగిరెడ్డి పల్లి మీదుగా ప్రయాణించారు. బ్రహ్మసముద్రం ఉన్నత పాఠశాలకు చేరుకున్నారు. విద్యార్థులకు కాస్సేపు పాఠాలు బోధించారు. అనంతరం ఆయన కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. పాఠశాలల్లో డ్రాపౌట్స్ను తగ్గించడంపై దృష్టి సారించామని అన్నారు. రవాణా సౌకర్యం లేక పాఠశాలలకు వెళ్లలేని స్థితిలో ఉన్న పిల్లలు, గ్రామాలను గుర్తిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న అమ్మఒడి పథకం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు భారీగా పెరిగాయని, దీనికి అనుగుణంగా రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తామని అన్నారు.