ఫ్లిప్కార్ట్లో అనంతపురం పండ్లు, కూరగాయలు: పుట్టపర్తి రైతులతో ఒప్పందం: కర్ణాటక రైతులతోనూ
అనంతపురం: టాప్ ఇ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్కార్ట్ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా కొనుగోలు చేయనుంది. పండ్లు, కూరగాయలను కొనుగోలు చేసి, వాటిని ఇ-కామర్స్ రూపంలో విక్రయించడానికి ఫ్లిప్కార్ట్ ముందుకొచ్చింది. అనంతపురం జిల్లాలోని పుట్టపర్తిలోని శ్రీసత్యసాయి ఫార్మర్ ఫెడరేషన్ రైతులతో ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్తో ఇలాంటి ఒప్పందాలను మరిన్ని కుదుర్చుకుంది ఫ్లిప్కార్ట్.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు షెడ్యూల్ ఫిక్స్: మోడీ సర్కార్కు సవాళ్లు ఇవే
బిహార్లోని పూర్ణియాలో గల అరణ్యాక్ అగ్రి ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్, కర్ణాటక కలబురగి జిల్లాలోని నిసర్గ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ, తమిళనాడులోని అంచెట్టి ఎఫ్పీసీఎల్తో ఈ రకమైన కాంట్రాక్ట్ను కుదుర్చుకుందా ఇ-కామర్స్ ప్లాట్ఫామ్. దీనితో పాటు ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి సొసైటీ (అప్మాస్), ఫౌండేషన్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ రూరల్ వ్యాల్యూ చెయిన్స్ (ఎఫ్డీఆర్వీసీ), సహజ ఆహారం ప్రొడ్యూసర్ కంపెనీ (సాప్కో), సమున్నతి, వృత్తి వంటి ఫార్మార్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లతో టైఅప్ అయింది.
రైతులు పండించే పంటలకు మార్కెట్ రేటుకు అనుగుణంగా చెల్లింపులను జరిపి, వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంది. నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులను వినియోగదారులకు నేరుగా అందించడంలో భాగంగా- ఫ్లిప్కార్ట్ ఈ ఒప్పందాలను కుదుర్చుకుంది. ఈ ఒప్పందాలను కుదుర్చుకున్న జిల్లాల్లో ప్యాకేజింగ్, ప్రాసెసింగ్ యూనిట్లను కూడా నెలకొల్పబోతున్నామని ఫ్లిప్కార్ట్ తెలిపింది. ఈ యూనిట్లల్లో గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పిస్తామని స్పష్టం చేసింది.
ప్యాకేజింగ్, ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పడానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి అనుమతి తీసుకుంటున్నామని పేర్కొంది. అలాగే- ప్యాకేజింగ్, ప్రాసెసింగ్లల్లో మహిళలకు శిక్షణ ఇవ్వడానికి టాటా ట్రస్ట్తో కలిసి పని చేస్తామని వెల్లడించింది. వ్యవసాయ, వ్యవసాయేతర ఉత్పత్తులకు ఆన్లైన్ ద్వారా మార్కెటింగ్, ఉపాధి అవకాశాలను కల్పించడం వల్ల గ్రామీణ స్థాయిలో మహిళలకు ఆర్థిక స్వావలంబనను కల్పించినట్టవుతుందని ఫ్లిప్కార్ట్ అభిప్రాయపడింది.
ఫ్లిప్కార్ట్.. ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం పట్ల అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. వ్యవసాయ, ఉద్యానవన ఉత్పత్తులు, కూరగాయలకు ఆన్లైన్ మార్కెటింగ్ సంస్థలు భాగస్వాములు కావడం గర్వించదగ్గ విషయమని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపునకు ఆయా కంపెనీలు స్పందించాయని చెప్పారు. ఫ్లిప్కార్ట్ ఇప్పటికే అనంతపురం జిల్లాలోని పలు మహిళ, రైతు సొసైటీలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం శుభపరిణామమని అన్నారు.