YSRCPకి హిందూపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే: వైఎస్సార్ ప్రభంజనంలోనూ విజయం సాధించిన నేతగా
అనంతపురం: రాష్ట్రంలో ఇటీవలే ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. కొన్ని అనూహ్య స్థానాల్లో ఘన విజయాలను అందుకుంది. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి కంచుకోటలుగా భావించే నియోజకవర్గాల్లో పాగా వేసింది. గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకుంది. క్షేత్రస్థాయిలో టీడీపీ ఓటుబ్యాంకును దెబ్బకొట్టగలిగింది. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల కూడా మెజారిటీ పంచాయతీల్లో తమ పార్టీ మద్దతుదారులను వైఎస్సార్సీపీ గెలిపించుకోగలిగింది. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న స్థానాల్లో వైసీపీ సాధించిన విజయాలు దీనికి ఉదాహరణ.
ఒక్కసారి కూడా ఓడిపోని స్థానంలో..
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచీ ఒక్కసారి కూడా ఓటమి చవి చూడని నియోజకవర్గాల్లో హిందూపురం ఒకటి. 1983 నుంచీ ఆ పార్టీ అభ్యర్థులే ఇక్కడ వరుస విజయాలను అందుకుంటూ వస్తోన్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, ఆయన కుటుంబానికి చెక్కు చెదరని ఓటు బ్యాంకు ఉంది ఈ నియోజకవర్గం పరిధిలో. ఇక్కడ జరిగిన ప్రతి ఎన్నికలోనూ టీడీపీ రాజకీయ ప్రత్యర్థులు నామమాత్రంగా పోటీ ఇస్తూ వస్తోన్నారంతే.
విష్ణువర్ధన్ రెడ్డిపై చెప్పుతో దాడి చేసిన వ్యక్తి టీడీపీ కార్యకర్తేనట: సోము ఏం చెబుతున్నారు?
హిందూపురంలో మరింత బలోొపేతం అయ్యేలా..
అలాంటి కంచుకోటను వైసీపీ వ్యూహాత్మకంగా బద్దలు కొడుతూ వస్తోంది. మైనారిటీ ఓటర్లు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్న ఈ నియోజకవర్గాన్ని అదే వర్గానికి చెందిన మాజీ ఐపీఎస్ అధికారి ఇక్బాల్కు అప్పగించిన తరువాత.. కొన్ని సానుకూల ఫలితాలు వెలువడుతున్నాయి. మొన్నే ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను గెలుచుకోగలిగింది. వైసీపీ గ్రామస్థాయిలో చొచ్చుకు వెళ్లిందనడానికి, టీడీపీ ఓటుబ్యాంకును బలహీనపర్చిందడానకి ఈ ఫలితాలను ఉదాహరణగా చూపిస్తోన్నారు పార్టీ నేతలు. పార్టీని మరింత బలోపేతం చేసుకునే దిశగా చర్యలు తీసుకుంటోంది.
టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు కండువా..
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పామిశెట్టి రంగనాయకులును వైసీపీ.. పార్టీలో చేర్చుకుంది. టీడీపీకి రాజీనామా చేసిన ఆయన తన కుమారులతో సహా వైసీపీలో చేరారు. వైసీపీ ఇన్ఛార్జ్ ఇక్బాల్ ఆయనకు పార్టీ కండువాను కప్పి ఆహ్వానించారు. హిందూపురం నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఆయన విజయం సాధించారు. హిందూపురంలో టీడీపీ తరఫున విజయం సాధించిన మొట్టమొదటి ఎమ్మెల్యే ఆయనే. 1983లో టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. అనంతరం 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభంజనాన్ని సైతం తట్టుకుని ఘన విజయాన్ని అందుకున్నారు.
కొంతకాలంగా పార్టీకి దూరంగా..
2009 ఎన్నికల్లో రంగనాయకులు పోటీ చేయలేదు. మైనారిటీ ఓటుబ్యాంకును దృష్టిలో ఉంచుకుని 2009లో అదే వర్గానికి చెందిన అబ్దుల్ ఘనీకి టికెట్ ఇచ్చింది టీడీపీ. అప్పటి నుంచి ఆయన పార్టీకి దూరంగా ఉంటూ వస్తోన్నారు. అయినప్పటికీ.. పార్టీ మీద అభిమానంతో 2014, 2019 ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణ విజయం సాధించడానికి తనవంతు కృషి చేశారు. తాజాగా టీడీపీకి గుడ్బై చెప్పారు. వైసీపీలో చేరారు. కుమారుల రాజకీయ భవిష్యత్ కోసమే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని జిల్లాలో ప్రచారం సాగుతోంది.