ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లాడు... ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు- అనంతపురం జిల్లాలో ఘటన..
అనంతపురం జిల్లా ధర్మవరంలో ఇవాళ ఓ విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో అనంతపురం జిల్లాలో బస్సులు తిప్పేందుకు అధికారులు ప్రయత్నిస్తున్న సందర్భంగా ధర్మవరం డిపోకు వచ్చిన ఓ వ్యక్తి అప్పుడే సిద్దం చేసి ఉంచిన ఓ బస్సు ఎక్కాడు. డ్రైవింగ్ అనుభవం కూడా ఉండటంతో దర్జాగా దాన్ని స్టార్ట్ చేశాడు. బస్సు కాస్త ముందుకు వెళ్లగానే అప్రమత్తమైన డిపో సిబ్బంది వెంబడించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. బస్సును దొంగతనం చేసిన సదరు వ్యక్తి దాన్ని బెంగళూరు వైపుకు స్పీడుగా తీసుకెళ్లిపోయాడు.
తక్షణం ధర్మవరం డిపో సిబ్బంది తమ బస్సును ఎవరో వ్యక్తి ఎత్తుకెళ్లిపోతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే బెంగళూరు వెళ్లే రహదారుల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు.
ఎట్టకేలకు కియా మోటార్స్ పరిశ్రమ సమీపంలో దాన్ని పార్క్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అక్కడికి చేరుకుని దొంగను అదుపులోకి తీసుకున్నారు. లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్న తరుణంలో అనంతపురం జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆర్టీసీ సిబ్బందితో పాటు పోలీసులను సైతం కాసేపు షాక్ కు గురి చేసింది.