ఏపీ ఇలాకాలో జరుగుతోంది అదే.. అక్కడ ఎవరు గెలిస్తే ఆ పార్టీదే అధికారం..!
అనంతపురం : అక్కడ ఎవరైతే గెలుస్తారో వారి పార్టీయే అధికారంలోకి వస్తుంది. ఇది నిన్న, మొన్నటి నుంచి వస్తున్న ఆనవాయితీ కాదు.. నాలుగు దశాబ్ధాలుగా అదే జరుగుతోంది. ఏపీ ఇలాకాలో ప్రస్తుతం ఈ అంశం హాట్ టాపికయింది. ఆ సెగ్మెంట్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఇంట్రెస్టింగ్గా మారిన ఆ నియోజకవర్గంపై ఓ లుక్కేద్దాం.
శింగనమల 40 ఇయర్స్ రికార్డ్..!
అనంతపురం జిల్లాలోని శింగనమల అసెంబ్లీ నియోజకవర్గం రూటే సెపరేటు. ఇక్కడ నుంచి ఎవరైతే గెలుస్తారో.. వారి పార్టీయే అధికారంలోకి రావడం ఆనవాయితీగా వస్తోంది. గత నాలుగు దశాబ్ధాలుగా ఇదే సీన్ రిపీట్ అవుతోంది. అదే క్రమంలో ఈసారి కూడా జిల్లావాసులు ఈ నియోజకవర్గం ఫలితంపై ఆసక్తిగా ఎదురుచూశారు.
ఎవరైతే ఈ సెగ్మెంట్ నుంచి గెలుస్తారో.. వారి పార్టీ అధికారంలోకి రావడం ఇప్పుడు కొత్త కాదు. దాదాపు నాలుగు దశాబ్ధాల నుంచి అదే తీరు నడుస్తోంది. 1978లో జనతా పార్టీ నుంచి పోటీచేసిన రుక్మిణీదేవి విజయం సాధించారు. దాంతో జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో ఎస్సీ రిజర్వ్డ్ కేటగిరీగా ఉంది శింగనమల సెగ్మెంట్.
కేసీఆర్ వల్ల ఆ మూడు చోట్ల గెలుపు..! పెద్దపల్లి విషయంలో బీజేపీ తప్పటడుగు
ఆనాటి నుంచి ఈనాటి దాకా..!
1982లో టీడీపీ ఆవిర్భావం తర్వాత అదే సీన్ రిపీటైంది. 1983లో టీడీపీ అభ్యర్థిగా గురుమూర్తి.. శింగనమల స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దాంతో ఆ సమయంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే 1985లోనూ టీడీపీ అభ్యర్థి జయరాం ఎమ్మెల్యేగా గెలుపొందడంతో తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. 1989లో శమంతకమణి కాంగ్రెస్ తరపున పోటీచేసి ఎమ్మెల్యేగా ఎన్నికైన క్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 1994లో తిరిగి జయరాం గెలుపొందడంతో టీడీపీకి అధికారం చేజిక్కింది.
1999లోనూ టీడీపీ హవానే కొనసాగింది. ఆ సమయంలో టీడీపీ తరపున మళ్లీ జయరాం పోటీ చేసి గెలుపొందారు. దాంతో టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. 2004లో కాంగ్రెస్ నుంచి సాకే శైలజానాథ్ ఎమ్మెల్యేగా గెలవడంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అది అలాగే కంటిన్యూ చేస్తూ 2009లోనూ మళ్లీ ఆయనే గెలవడంతో అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
ఈసారి కూడా అదే ఆనవాయితీ..!
2014లో ఉమ్మడి రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. ఆ సందర్భంలో టీడీపీ అభ్యర్థిగా యామిని బాల శింగనమల నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు. దాంతో టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. అలాగే ఈసారి కూడా వైసీపీ అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతి పోటీ చేసి విజయం సాధించడంతో.. ఆ పార్టీకి బంపర్ మెజార్టీ లభించి అధికారం దక్కినట్లైంది.
అలా నాలుగు దశబ్ధాలుగా శింగనమల అసెంబ్లీ సెగ్మెంట్ రికార్డులు సృష్టిస్తోంది. అక్కడ ఎవరైతే గెలుస్తారో వారి పార్టీయే అధికారంలోకి వస్తుండటం విశేషం. 1978 నుంచి ఇప్పటిదాకా శింగనమల సెంటిమెంట్ అలా వర్కవుట్ అవుతోందన్నమాట.