అనంతలో భారీ చోరీ.. ఒక్క దొంగ కోసం వెయ్యి మంది పరుగులు.. చివరకు..!
విజయవాడ : అనంతపురం జిల్లాలో భారీ చోరీ జరిగింది. మహిళ నుంచి 16 లక్షల రూపాయల బ్యాగును కొట్టేశాడు దొంగ. అయితే వాడిని పట్టుకునేందుకు ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు వెయ్యి మంది పరుగులు పెట్టాల్సి వచ్చింది. సినిమా సీన్ తలపించేలా జరిగిన ఘటన ఆంధ్రప్రదేశ్లో చర్చానీయాంశంగా మారింది.
అనంతపురం జిల్లా యల్లనూరు మండల కేంద్రంలో శుక్రవారం (01.11.2019) నాడు జరిగిన దొంగతనం హాట్ టాపికైంది. తిమ్మపల్లికి చెందిన పంచాయతీ కార్యదర్శి నాగలక్ష్మి వృద్దాప్య పింఛన్ల పంపిణీకి సంబంధించి యల్లనూరులోని ఓ బ్యాంకు నుంచి 16 లక్షల రూపాయలు డ్రా చేశారు. అంత పెద్ద మొత్తాన్ని ఓ బ్యాగులో సర్ధి ఆటోలో వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అదే సమయంలో కుళ్లాయప్ప అనే పాత దొంగ భయభ్రాంతులకు గురి చేసి ఆమె చేతిలో నుంచి ఆ బ్యాగ్ లాక్కుని పరారయ్యాడు.
హయత్నగర్ టు ఆమంగల్.. కీర్తి రెడ్డికి అబార్షన్ చేసిందెవరు.. తల్లి హత్య కేసులో మరో కోణం..!
ఒక్క క్షణం ఏం జరుగుతుందో తెలియని నాగలక్ష్మి వెంటనే తేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఆమె ఫోన్తో సకాలంలో స్పందించిన పోలీసులు చుట్టుపక్కల గ్రామ పెద్దలను అప్రమత్తం చేశారు. దొంగతనం జరిగిన వివరాలు చెప్పడంతో ఆ దొంగను పట్టుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆయా గ్రామాల ప్రజలు ఆ ఒక్క దొంగను పట్టుకునే వేటలో పడ్డారు. అలా దాదాపు వెయ్యి మంది ప్రజలు దొంగ కోసం గాలిస్తున్న క్రమంలో కొందరి చేతికి చిక్కాడు. దాంతో అందరూ కలిసి దేహశుద్ది చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించడంతో వాడి నుంచి డబ్బులున్న బ్యాగును స్వాధీనం చేసుకుని నాగలక్ష్మికి అప్పగించారు.