అనంతపురంలో ఇష్టరాజ్యంగా కరోనా పరీక్షలు- రెండు డయాగ్నస్టిక్ సెంటర్ల మూత...
అనంతపురం : కరోనా మహమ్మారి ప్రభావం మొదలైన తర్వాత ప్రభుత్వమే కోవిడ్ పరీక్షలు నిర్వహించింది. సమస్య తీవ్రత ఎంత ఉన్నా ప్రభుత్వ ఆస్పత్రులకే వెళ్లక తప్పేది కాదు. కానీ ఆ తర్వాత కరోనా తీవ్రత పెరగడంతో ప్రభుత్వం తప్పనిసరి పరిస్ధితుల్లో ప్రైవేటుకు కూడా అనుమతులు ఇవ్వడం మొదలుపెట్టింది. ఇదే అదనుగా దోపిడీ కూడా మొదలైంది. అవసరం ఉన్నా లేకున్నా కోవిడ్ పరీక్షల పేరుతో లక్షల రూపాయలు దోచుకోవడం పెరిగిపోయింది. ఇదే కోవలో ఎక్కువ కేసులు నమోదవుతున్న జిల్లాల్లో ఒకటైన అనంతపురంలో కరోనా పరీక్షల పేరుతో జరుగుతున్న దోపిడీపై అధికారులు దృష్టిపెట్టారు.
అనంతపురం కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశాలతో నిర్వహించిన దాడుల్లో రెండు డయాగ్నస్టిక్ సెంటర్లు తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు తేలింది. అనంతపురం పట్టణంలోని స్టార్ డయాగ్నోస్టిక్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు సీజ్ చేశారు.
స్టార్ డయాగ్నోస్టిక్ సెంటర్లో కోవిడ్ నిర్ధారణ పరీక్షలకు సంబంధించి వైద్యాధికారుల సిఫారసు లేకున్నా ఎంఆర్ఐ, సిటీ స్కాన్ తీస్తున్నట్లు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశాల మేరకు డీఎంహెచ్ ఓ డాక్టర్ కామేశ్వర ప్రసాద్, అదనపు డిఎమ్ హెచ్ఓ డాక్టర్ రామసుబ్బారావు స్టార్ డయాగ్నొస్టిక్ సెంటర్ సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్ఐ, సిటి స్కాన్ లకు ప్రజల నుండి నిర్దేశిత మొత్తాల కన్నా అధికంగా స్టార్ డయాగ్నోస్టిక్ సెంటర్ యాజమాన్యం వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు.
Recommended Video
అనంతపురంలోని కొన్ని డయాగ్నిస్టిక్స్ సెంటర్లలో రెఫరల్ లేకున్నా పరీక్షలు చేస్తున్నట్లు, అవకతవకలు జరుగుతున్నట్లు తేలింద కలెక్టర్ తెలిపారు. నగరంలో ఇలాంటి పరీక్షలు నిర్వహిస్తున్న రెండు డయాగ్నిస్టిక్స్ ల్యాబ్స్ ను మూసివేస్తున్నామని, .మిగిలినవాటికి షోకాజ్ నోటీసులు ఇస్తున్నామన్నారు.