అనంతలో ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురి దుర్మరణం: తుఫాన్ వాహనం తుక్కుతుక్కు
అనంతపురం: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఏడుమంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. రోడ్డు మధ్యన ఓ ఎద్దును తప్పించబోయి తుఫాన్ వాహనం.. ఎదురుగా వస్తోన్న లారీని ఢీ కొట్టడం వల్ల ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను చేపట్టారు.
జిల్లాలోని తాడిపత్రి పట్టణ శివార్లలో మంగళవారం తెల్లవారు జామున ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. తాడిపత్రి మెయిన్ బజార్ ప్రాంతానికి చెందిన వెంకట రంగయ్య, సుబ్రహ్మణ్యం, హేమలత వారి కుటుంబ సభ్యులు తిరుపతిలోని తమ బంధువుల ఇంట్లో జరిగిన అంత్యక్రియల కార్యక్రమానికి హాజరయ్యారు. సోమవారం రాత్రి వారు తూఫాన్ వాహనంలో స్వస్థలానికి తిరుగు ప్రయాణం అయ్యారు. తెల్లవారు జామున తాడిపత్రి పట్టణ సమీపంలో గరుడ స్టీల్ ప్లాంట్ వద్ద వారు ప్రయాణిస్తోన్న వాహనం ప్రమాదానికి గురైంది. రోడ్డు మధ్యలో ఉన్న ఎద్దును తప్పించబోయి ఎదురుగా వస్తోన్న లారీని ఢీకొట్టింది.
Recommended Video
ఈ ప్రమాదంలో వెంకట రంగయ్య, సుబ్రహ్మణ్యం, హేమలత సంఘటనా స్థలంలోనే దుర్మరణం పాలయ్యారు. తుఫాన్ వాహనం నుజ్జునుజ్జయింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని తాడిపత్రి ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం తీవ్రతకు తుఫాన్ వాహనం నుజ్జునుజ్జుగా మారింది. గాయపడ్డ వారిని బయటికి తీయడానికి స్థానికులు, పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. సీట్ల మధ్య వారు ఇరుక్కుపోయారు. గ్యాస్ కట్టర్లను తెప్పించి, వాటి సహాయంతో గాయపడ్డ వారిని వెలికి తీశారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.