బీర్ తాగుతూ కారు డ్రైవ్?: యువతులతో కలిసి: అనంతపురం రోడ్డు ప్రమాదంలో నలుగురి దుర్మరణం
అనంతపురం: అనంతపురం జిల్లాలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి దాటిన తరువాత చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. వారిలో ఇద్దరు యువతులు ఉన్నారు. ప్రమాదానికి గురైన కారు నుంచి బీర్ బాటిళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. అతివేగానికి మద్యం, నిద్రమత్తు తోడు కావడమే ఈ దుర్ఘటనకు కారణమని భావిస్తున్నారు. సమాచారం అందుకున్నవెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్ట్మార్టమ్ కోసం పంపించారు.
జిల్లాలోని పెనుకొండ సమీపంలో బెంగళూరు-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన సంభవించింది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తోన్న కారు.. కియా కార్ల పరిశ్రమ సమీపంలో ప్రమాదానికి గురైంది. కియా కార్ల ఫ్యాక్టరీ వద్ద హఠాత్తుగా స్లో అయిన లారీని ఈ కారు వెనుక వైపు నుంచి బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తోన్న నలుగురూ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జు అయింది. మృతదేహాలు అందులోనే ఇరుక్కుపోయాయి. వాటిని వెలికి తీయడానికి శ్రమించాల్సి వచ్చింది.
మృతుల్లో ఇద్దరు యువకులు, ఇద్దరు యువతులు ఉన్నారు. వారిలో మనోజ్ మిట్టల్ అనే యువకుడు ఢిల్లీకి చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు. మిగిలిన వారిని గుర్తించాల్సి ఉంది. కారులో బీర్ బాటిళ్లు లభ్యమైనట్లు తెలుస్తోంది. మద్యం, నిద్రమత్తు, అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ఎదురుగా వెళ్తోన్న లారీ హఠాత్తుగా స్లో కావడాన్ని గమనించకపోవడం వల్ల అదే వేగంతో కారు వెనుక నుంచి బలంగా ఢీ కొట్టిందని అంటున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పెనుకొండ ఆసుపత్రికి తరలించారు.