తహశీల్దార్ ఆఫీసు వద్ద రైతు.. పురుగుల మందు డబ్బాతో... ఇళ్లు, భూమి పట్టా చేయడం లేదని....
అబ్దుల్లాపూర్మెట్ ఘటన మరవకముందే రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. తమ భూమి, ఇంటికి సంబంధించి పట్టా ఇవ్వడం లేదని ఓ రైతు వాపోయాడు. తహశీల్దార్ను నెత్తి, నోరు బాదుకొని మొత్తుకున్నాడు. అయినా తహశీల్దార్ కార్యాలయ అధికారులు కనికరించలేదు. దీంతో లాభం లేదనుకొన్న రైతు.. తన చావు సమస్యకు పరిష్కారం అనుకొన్నాడు. పురుగుల మందు డబ్బా తీసుకొని తహశీల్దార్ కార్యాలయం వద్దకొచ్చాడు.
రెవెన్యూ లీలలు: పాస్ పుస్తకం ఇవ్వని సిబ్బంది, తహశీల్దార్ కార్యాలయంలో నిద్రపోతూ రైతు ఆందోళన
స్పందనలో ఒక్కసారిగా అలజడి..
వీకెండ్ తర్వాత సోమవారం కార్యాలయల్లోకి జనం బారులు తీరతారు. ఆంధ్రప్రదేశ్లో స్పందన పేరుతో కార్యక్రమం ప్రారంభించారు. తమ సమస్యను స్పందన కార్యక్రమంలో ఆయా వర్గాల వారు ఫిర్యాదు చేయొచ్చు. ఇవాళ అనంతపురం జిల్లా గుమ్మగట్ట తహశీల్దార్ కార్యాలయం వద్దకు జనం భారీగానే వచ్చారు. వారిలో జయరామిరెడ్డి ఒకరు. తనను వేధిస్తోన్న అధికారులకు బుద్ది చెప్పాలని అనుకొన్నాడు.
విసిగి వేసారి..
తన భూమి, ఇళ్ల పట్టాను తహశీల్దార్ ఇవ్వడం లేదు. రెండేళ్ల క్రితమే ప్రభుత్వం మంజూరు చేసిన.. తహశీల్దార్ మాత్రం కరుణించడం లేదు. దీనిపై చాలాసార్లు విన్నవించుకున్న ఫలితం లేకపోయింది. ఇక లాభం లేదనుకొని, అప్పటికే తనతో తీసుకొచ్చిన పురుగుల మందు డబ్బా తీసి తాగాడు. ఈ హఠాత్ పరిణామంతో అక్కడున్న వారు విస్తుపోయారు. ఆయనను నిలువరించే ప్రయత్నం చేశారు. కానీ అపస్మారకస్తితిలోకి వెళ్లడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. సీరియస్గా ఉండటంతో రాయదుర్గం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
భూమి ఇవ్వకపోవడంతోనే
తమకు ప్రభుత్వం భూమి మంజూరుచేసిన అధికారులు ఇవ్వడం లేదని జయరామిరెడ్డి భార్య పల్లవి పేర్కొన్నారు. పట్టా ఇవ్వమంటే రేపు, మాపు అని కాలం వెళ్లదీస్తున్నారని తెలిపారు. తమ భూమిలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తే ఏడుగురు అడ్డుకుంటున్నారని చెప్పారు. మరికొందరు వచ్చి బెదిరిస్తున్నారని పల్లవి తెలిపారు. భూమిలో అడుగుపెడితే క్రిమినల్ కేసు పెడతామంటూ బెదిరిస్తున్నారని వాపోయారు. గ్రామంలో వేధింపులు, అధికారులు పట్టా ఇవ్వకపోవడంతోనే తన భర్త పురుగుల మందు తాగాడని పల్లవి చెప్తున్నారు.
ఉన్నతాధికారులు సీరియస్
ఇటీవల జరిగిన అబ్దుల్లాపూర్ మెట్ ఘటన తెలుగురాష్ట్రాల్లో కలకలం రేపింది. ఆ తర్వాత ఏపీలోని గుమ్మగట్లలో మరో రైతు ఆత్మహత్యాయత్నం చేయడం చర్చకు దారితీసింది. రెవెన్యూ శాఖలో నెలకొన్న అవినీతిని కూకటివేళ్లతో పెకిలించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. ఈ క్రమంలో రైతు జయరామిరెడ్డి ఆత్మహత్యాయత్నంపై ఉన్నతాధికారులు కూడా సీరియస్గా తీసుకున్నారు. రైతు సూసైడ్ అటెంప్ట్కు గల కారణాలు వివరించాలని గుట్టమట్ట అధికారులను ఆదేశించారు.