జేసీకి జగన్ మరో షాక్ : మొన్న బస్సులు సీజ్.. ఇప్పుడు సిమెంట్ లీజులు రద్దు
మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి సర్కార్ మరో షాక్ ఇచ్చింది. యాడికిలోని జేసీకి చెందిన త్రిశూల్ సిమెంట్ కంపెనీ లీజును ప్రభుత్వం రద్దు చేసింది. కొనుప్పలపాడులో 649.86 హెక్టార్ల పరిధిలోని సున్నపు రాతి గనుల లీజులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో సిమెంట్ తయారీ ప్లాంట్ నిర్మాణానికి ఐదేళ్ల గడువు ఇస్తూ జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కు తీసుకుంది. అక్కడ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి ముందడుగు పడనందునే ఐదేళ్ల గడువును రద్దు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.అంతేకాదు,లీజు ప్రాంతం నుంచి 38,212 మెట్రిక్ టన్నుల సున్నపు రాయి నిక్షేపాలను అక్రమంగా తవ్వితీసి.. రవాణా చేయటంపై విచారణ కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
జేసీపై ఆరోపణలు :
సిమెంట్ ప్లాంట్ నిర్మాణం పేరుతో మైనింగ్ లైసెన్సులు పొంది, ఖనిజాన్ని వేరేవాళ్లకు విక్రయిస్తున్నారన్న ఆరోపణలు జేసీపై ఉన్నాయి. ఈ నేపథ్యంలో దానిపై ప్రభుత్వం విచారణ జరుపుతోంది. ఇదే క్రమంలో లీజును రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.అయితే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తమను టార్గెట్ చేసిందని.. ఆలస్యం కారణంగా లీజును రద్దు చేయడం సరికాదని జేసీ అనుచరులు వాపోతున్నారు. ఇప్పటికైతే దీనిపై జేసీ నుంచి ఎటువంటి స్పందనా రాలేదు.
గతంలో జేసీ బస్సులు సీజ్
గతంలో జేసీ బ్రదర్స్కు చెందిన బస్సులను ప్రభుత్వం సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇంటర్ స్టేజ్ క్యారియర్ బస్సుల పర్మిట్లలో అవకతవకల కారణంగా అధికారులు దాదాపు 36 బస్సులను,అలాగే 18 కాంట్రాక్టు బస్సులను సీజ్ చేశారు. పర్మిట్లలో అవకతవకలకు తోడు నిబంధనలకు విరుద్దంగా బస్సులు నడుస్తున్నట్టు తమకు ఫిర్యాదులు అందాయని అప్పట్లో రవాణా శాఖ అధికారులు తెలిపారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం,టికెట్ ధరలను ఇష్టానుసారం పెంచడం వంటి అంశాలపై తమకు ఫిర్యాదులు అందినట్టు చెప్పారు.
జేసీ ఎలా స్పందిస్తారో..
తమ బస్సులను సీజ్ చేసిన సమయంలో జేసీ తన శైలికి భిన్నంగా రాజీ ధోరణిలో స్పందించారు. కొంతకాలం బస్సుల బిజినెస్ మానేస్తానంటూ ఆయనే స్వయంగా ప్రకటించారు.కేసుల గొడవ కంటే కొంతకాలం బిజినెస్ ఆపేయడమే మేలు అని వ్యాఖ్యానించారు. అయితే ప్రతీకార వాంఛతోనే తమపై ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. మరి ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వులపై జేసీ ఎలా స్పందిస్తారో చూడాలి.