రెయిన్ గన్లతో అనంత కరవును పారద్రోలా: మళ్లీ గెలిపించండి..కష్టాలు తీరుస్తా: చంద్రబాబు
అనంతపురం: తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూఖ్ అబ్దుల్లాతో కలిసి కడపలో రాయలసీమ జిల్లాల ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కడప, కర్నూలు జిల్లాలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు.
ఇప్పటికే గుత్తి, మడకశిర నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం బహిరంగ సభల్లో పాల్గొన్న చంద్రబాబు నాయుడు..గురువారం ఉదయం పుట్టపర్తికి చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. టీడీపీ హిందూపురం లోక్ సభ అభ్యర్థి నిమ్మల కిష్టప్ప, పుట్టపర్తి అసెంబ్లీ అభ్యర్థి, మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డిలతో కలిసి బహిరంగ సభల్లో ప్రసంగించారు.
వైఎస్ఆర్ సీపీలో చేరిన సినీ రచయిత చిన్నికృష్ణ, టీడీపీ మాజీ ఎమ్మెల్యే!
రెయిన్ గన్లతో కరవును పారద్రోలా:
ఎప్పట్లాగే.. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ గా చేసుకున్నారు చంద్రబాబు. ఆయనపై విమర్శలు గుప్పించారు. జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అరాచకం పెరిగిపోతుందని విమర్శించారు. జగన్ ది నేరచరిత్ర అని అన్నారు. పట్టిసీమ, హంద్రీనీవా, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణానికి జగన్ అడ్డుపడ్డారని ఆరోపించారు. ప్రజల కోసం తాను బుల్లెట్ లా దూసుకెళ్తానని చెప్పారు. అనంతపురం జిల్లాలో కరవును పారద్రోలానని అన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించానని, రెయిన్ గన్లతో పంటలను సస్యశ్యామలం చేశానని చెప్పారు. జగన్ కు తాను భయపడి ఉంటే అనంతపురం జిల్లాకు సాగు నీళ్లు వచ్చేవి కావని చెప్పారు.
పసుపు-కుంకుమ కోసం మరో రూ.4000 ఇస్తా:
నదుల అనుసంధానంతో అనంతపురం చరిత్ర మారుస్తానని హామీ ఇచ్చారు. మళ్లీ తనను గెలిపించాలని సూచించారు. ప్రజల భవిష్యత్ని బంగారు మయం చేస్తానని భరోసా ఇచ్చారు. డ్వాక్రా మహిళలకు పసుపు-కుంకుమ ఇచ్చామని తెలిపారు. ఏప్రిల్ 4న డ్వాక్రా మహిళలకు మరో 4000 రూపాయలు అందిస్తామని వెల్లడించారు. పింఛన్ మొత్తాన్ని 2000 నుంచి 3000 రూపాయలకు పెంచుతానని అన్నారు. చంద్రన్న బీమాతో కార్యకర్తలను ఆదుకుంటున్నామని పేర్కొన్నారు. రైతులకు 24, 500 కోట్ల రూపాయల రుణమాఫీ చేసినట్లు గుర్తు చేశారు.
రాయలసీమ అభివృద్ధి చెందితే రాష్ట్రం పురోగమించినట్టే:
వెనుకబడిన రాయలసీమ జిల్లాలు అభివృద్ధి చెందితే.. రాష్ట్రం పురోగమించినట్టేనని చంద్రబాబు అన్నారు. రాయలసీమ జిల్లాలను అభివృద్ధి చేయడానికి తాను అహర్నిశలు శ్రమిస్తున్నానని అన్నారు. జిల్లాకు కియా కార్ల కంపెనీని తీసుకొచ్చానని వివరించారు. సౌర విద్యుత్ హబ్ గా మార్చివేశానని చెప్పారు. జగన్ అధికారంలోకి వస్తే.. అభివృద్ధి పనులు ఆగిపోతాయని అన్నారు. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకొచ్చానని చెప్పారు. వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి వస్తే, పెట్టుబడులు రావని చెప్పారు.