చుక్కలు చూపిన వెబ్.. అభ్యర్థులు లబోదిబో.. ప్రహసనంగా డీఎస్సీ ఆప్షన్ల ప్రక్రియ
అనంతపురం : నిరుద్యోగులతో చెలగాటమాడటం ప్రభుత్వ శాఖలకు కొత్తేమీ కాదు. పరీక్షల పేరిట వందలకు వందలు వసూలు చేస్తూ నిరుద్యోగులను ముప్పుతిప్పలు పెట్టిన సందర్భాలు అనేకం. తాజాగా డీఎస్సీ కేంద్రాల ఆప్షన్ల ప్రక్రియ కూడా ఉద్యోగార్థులకు చుక్కలు చూపించింది. వెబ్సైట్ మొరాయించడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అధికారుల నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
డీఎస్సీ కేంద్రాలు ఎంపిక చేసుకోవడానికి సోమవారం నుంచి అభ్యర్థులకు అవకాశం కల్పించారు అధికారులు. దీంతో ఇంటర్నెంట్ సెంటర్ల దగ్గర పడిగాపులు కాశారు. అయితే సదరు వెబ్సైట్ ఎంతకూ ఓపెన్ కాకపోవడంతో ఆప్లన్షు ఎంచుకునే ఛాన్స్ లేకుండా పోయింది.
మారని అధికారుల తీరు
డీఎస్సీ కేంద్రాల ఆప్షన్లు పెట్టుకోవడానికి సోమవారం ఉదయం నుంచి అనుమతి ఇస్తూ షెడ్యూల్ విడుదల చేశారు అధికారులు. దీంతో ఇంటర్నెట్ సెంటర్లకు క్యూ కట్టారు అభ్యర్థులు. అయితే వెబ్సైట్ మొరాయించడంతో ఆప్షన్లు పెట్టుకోవడం కుదరలేదు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు వేచి చూసినా సర్వర్ పనిచేయలేదు. అసలు వెబ్సైట్ పనిచేస్తుందా లేదా సర్వర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఇలాంటి అంశాలకు సంబంధించి అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో సైట్ ఏ క్షణాన్నైనా ఓపెన్ కావొచ్చనే నమ్మకంతో చాలామంది నెట్ సెంటర్ల దగ్గరే ఉండిపోయారు. చివరకు రాత్రి వరకు వెయిట్ చేసినా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. దీంతో మహిళలు, గర్భిణీలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. గతంలో కూడా ఇలాగే జరిగిన సందర్భాలున్నాయి.
ఎస్జీటీలే అధికం
అనంతపురం జిల్లా నుంచి డీఎస్సీకి 52,142 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో ఎస్జీటీలే అత్యధికంగా 39,701 మంది అప్లై చేశారు. అయితే డీఎస్సీ కేంద్రాల ఆప్షన్ల ప్రక్రియ అభ్యర్థులకు అసలు పరీక్షకు మించి భారంలా మారింది. ఈనెల 3 నుంచి 9వరకు సెంటర్లు ఎంపిక చేసుకునేలా షెడ్యూల్ రిలీజ్ చేసిన అధికారులు వెబ్సైట్ పనిచేస్తుందా లేదా అనే విషయం పట్టించుకోలేదు. దీంతో అభ్యర్థులు మొదటిరోజంతా ఇంటర్నెట్ సెంటర్ల దగ్గర నిరీక్షించే పరిస్థితి తలెత్తింది.
ఆప్లన్లు త్వరగా పెట్టాలి.. ఇదే కారణం
ఎస్జీటీలకు ఎక్కువమంది అప్లై చేసుకోవడంతో కేంద్రాల ఆప్షన్ల ప్రక్రియ భారంలా మారింది. అయితే ఎవరైతే ముందుగా ఆప్షన్లు పెట్టుకుంటారో వారికే జిల్లాలో కేంద్రాలు కేటాయించడానికి మొదటి ప్రాధాన్యత లభిస్తుంది. ఆలస్యమైతే ఇతర జిల్లాల్లో కేంద్రాలు ఏర్పాటు చేస్తారనే భయంతో సోమవారం నాడు ఉదయం నుంచే ఇంటర్నెట్ సెంట్లరకు క్యూ కట్టారు. అయితే రోజంతా వేచిచూసినా లాభం లేకుండా పోయింది. రెండు హెల్ప్ లైన్లు ఏర్పాటు చేసినా అవి కూడా పనిచేయలేదు. ఆ నెంబర్లకు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చాయి. దీంతో అభ్యర్థులకు ఏంచేయలో తోచని పరిస్థితి.