‘శప్తభూమి’కి ప్రతిష్టాత్మక పురస్కారం, బండి నారాయణను వరించిన సాహిత్య అకాడమీ అవార్డు
ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు రచయిత బండి నారాయణ స్వామిని వరించింది. నేషనల్ అకాడమీ ఆఫ్ లెటర్స్ 2019వ సంవత్సరానికి సాహిత్య అకాడమీ పురస్కార విజేతలను ప్రకటించింది. 23 మందికి పురస్కరాలు వరించగా.. తెలుగులో బండి నారాయణ స్వామి ఉన్నారు. ఇంగ్లీష్ విభాగంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్కు పురస్కారం దక్కింది.
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా బండినారాయణ స్వామి స్వస్థలం. 1952 జూన్ 3న హన్నూరప్ప, పోలేరమ్మ దంపతులకు నారాయణ స్వామి జన్మించారు. చిన్నప్పటి నుంచే పుస్తక పఠనంపై ఆయనకు ఆసక్తి మెండుగా ఉండేది. అందుకే ఆయనను అందరూ స్వామి అని ముద్దుగా పిలుస్తుండేవారు. నారాయణ ఆసక్తి మేరకు తండ్రి హన్నూరప్ప సోవియెట్ యూనియన్ పుస్తకాలను తెప్పించేవారు. వాటిని చదివి నారాయణ మరింత ఆసక్తి కనబరిచేవారు.
బాల్యంలోనే దక్షిణామూర్తి అనే స్నేహితుడి ద్వారా పత్రికలు, నవలలను నారాయణ చదవడం ప్రారంభించారు. శ్రీ వెంకటేశ్వర వర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించారు. తర్వాత నవలలు రాయడం ప్రారంభించారు. తన నవలల్లో అనంతపురం జిల్లాలోని పరిస్థితులు, సామాజిక రుగ్మతలు అద్దంపట్టేవి. ఎక్కువగా దళిత బహుజన కోణంలోనే నవలలు ఉండేవి. సీమ పరిస్థితులను కూడా కళ్లకు కట్టినట్టు వివరించేవారు. నారాయణ స్వామి రాసిన శప్తభూమి నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది.