సునీతకు భారీ షాక్.. పరిటాల రవి కీలక అనుచరుడి తిరుగుబాటు: వైసీపీలోకి, ఎందుకంటే?
అనంతపురం: సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ కీలక నాయకురాలు, ఆంధ్రప్రదేశ్ మంత్రి పరిటాల సునీతకు గట్టి షాక్ తగిలింది. పరిటాల రవి కీలక అనుచరుడు ఒకరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన నిర్ణయం తీసుకున్నారు.
డబ్బు ఉండటం కాదు.. తీయాలి, రూ.60 కోట్లు సంపాదించి పెడతానని.. ఇది జగన్ మాట: నాగబాబు షాకింగ్
పరిటాల సునీతపై తీవ్ర అసంతృప్తి ఎందుకంటే
రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల సునీత కుటుంబ పాలన సాగిస్తున్నారని రాజన్న తీవ్ర ఆవేదనతో ఉన్నారు. సునీత తర్వాత పరిటాల శ్రీరాం ఇటీవలే రాజకీయాల్లో ఎదుగుతోన్న విషయం తెలిసిందే. ఆయన రాప్తాడులో కీలకంగా మారారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబ పాలన అని ఆరోపణలు చేయడం గమనార్హం. ఆమె వైఖరి కారణంగానే తాను గత నాలుగేళ్లుగా తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్నట్లు ఆయన చెబుతున్నారు. ఆయన సోమవారం తన స్వగ్రామం తల్లిమడుగులలో స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు, అనుచరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సునీత తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
పరిటాల రవి మృతి తర్వాత పక్కన పెట్టారు
పేదలకు న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతో నాడు తాను పరిటాల రవితో కలిసి నడిచానని, భూస్వామ్య పోరాటాలు చేసినట్లు రాజన్న తెలిపారు. రవి మరణం తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన పరిటాల సునీత తన భర్త ఆశయాలను పక్కన పెట్టారని ఆరోపించారు. రాప్తాడు నియోజకవర్గంలో సునీత కుటుంబ సభ్యులు, బంధువులకు తప్ప పేదలకు, బడుగు బలహీన వర్గాలకు జరుగుతున్న మేలు లేదని తీవ్ర ఆరోపణలు చేశారు.
సునీతతో వేగలేం
సునీతతో వేగలేమని, అందుకే పార్టీని వీడేందుకు సిద్ధమని రాజన్న చెప్పారు. తాను త్వరలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరనున్నట్లు తెలిపారు. పేదలకు న్యాయం జరగడం లేదని అందుకే జగన్ పక్షాన నిలిచేందుకు సిద్ధమయ్యామని చెప్పారు.