చంద్రబాబు, వైఎస్ కుటుంబాలపై సుజనా చౌదరి షాకింగ్ కామెంట్స్: రాష్ట్రానికి పట్టిన పీడగా
అమరావతి: కేంద్ర మాజీమంత్రి, భారతీయ జనతాపార్టీ నాయకుడు సుజనా చౌదరి ఒక్కసారిగా విరుచుకు పడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులపై ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు, వైఎస్ కుటుంబాలు రాష్ట్రానికి పట్టిన పీడగా అభివర్ణించారు. ఈ రెండు నాయకుల కుటుంబ పాలన నుంచి రాష్ట్రాన్ని బయటకు తీసుకుని రాగల సత్తా ఒక్క బీజేపీకి మాత్రమే ఉందని అన్నారు. ప్రాంతీయ పార్టీల కబంధ హస్తాల్లో రాష్ట్రం నలిగిపోతోందని ధ్వజమెత్తారు.
పర్యాటకులూ! బ్యాక్ ప్యాక్ సర్దుకోండి.. సియాచిన్ గ్లేసియర్ పిలుస్తోంది!
అనంతపురం జిల్లాలో గాంధీ సంకల్ప యాత్ర
బీజేపీ చేపట్టిన గాంధీ సంకల్ప యాత్రలో భాగంగా సోమవారం ఆయన అనంతపురం జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం గ్రామాల్లో ఆయన పర్యటన సాగింది. గుట్టకింది పల్లి, బడంగి పల్లి, చిగిచెర్ల, హంపాపురం మీదుగా గాంధీ సంకల్ప యాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా హంపాపురంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల వైఖరిపై మండి పడ్డారు. ఘాటు వ్యాఖ్యలతో విరుచుకు పడ్డారు. ఒకవంక చంద్రబాబు నాయుడి కుటుంబం, మరోవంక వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం మధ్య రాష్ట్రం నలిగిపోతోందని అన్నారు.
కుటుంబ పాలన కిందికి రాష్ట్రం..
తెలుగుదేశం, వైఎస్సార్సీపీలు రాష్ట్రాన్ని తమ కుటుంబాల చేతి కిందికి తీసుకెళ్లాయని ఆరోపించారు. జాతీయ భావాన్ని పుణికి పుచ్చుకుని, సమగ్ర అభివృద్ధికి దోహదం చేయాల్సిన స్థితిలో.. తమ నియంతృత్వ ధోరణిని ప్రదర్శిస్తున్నాయని సుజనా చౌదరి విమర్శించారు. తెలుగుదేశం ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ.. ఎన్టీ రామారావు మాత్రమే దాన్ని జాతీయ భావాలతో నడిపించారని సుజనా చౌదరి అన్నారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు చేతుల్లోకి వెళ్లిన తరువాత కుటుంబ పెత్తనం మితి మీరిందని అన్నారు. జాతీయ భావం గల ఒక్క పార్టీ అయినా ఉందా? అని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణలో అదే దుస్థితి..
రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొందని చెప్పారు. తెలంగాణలో టీఆర్ఎస్ సైతం ప్రభుత్వాన్ని కుటుంబ పాలన కిందికి తీసుకొచ్చిందని మండిపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, ఆయన కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత, మేనల్లుడు హరీష్ రావు పరిపాలన సాగిస్తున్నారని చెప్పారు. ఏపీలో పాలన అంతా రివర్స్ లో నడుస్తోందని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యం వల్ల రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని అన్నారు. వేల కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లుతోందని చెప్పారు. వైసీపీ నేతలు పిచ్చి వేషాలు వేస్తే కేంద్రం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.