అనంతపురం జిల్లా బాలికకు అరుదైన గౌరవం- కేంద్రమంత్రి ప్రస్తావన- న్యూ ఇండియా అంటూ...
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న పలు పథకాలు, అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదే కోవలో న్యూ ఇండియా పేరుతో విన్నూత్న చర్యలు చేపడుతున్న కేంద్రం... తాజాగా ఏపీ అధికారులు ఈ దిశగా చేపట్టిన ఓ చర్యను ప్రశంసించింది.
అనంతపురం జిల్లా అధికారులు బాలికలను ప్రోత్సహించే క్రమంలో ఒక్కో శాఖకు ఒక్కొక్కరు చొప్పున ఒక రోజు పాటు బాధ్యతలు నిర్వర్తించే అవకాశం కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 11న అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్బంగా ఎం. శ్రావణి అనే విద్యార్ధినికి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు నిర్వర్తించే అవకాశం కల్పించారు. దీంతో ఆమె ఒక రోజు కలెక్టర్గా వ్యవహరించడమే కాకుండా రెండు ఫైళ్లపై సంతకాలు కూడా చేసింది. అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు "బాలికే భవిష్యత్తు" కార్యక్రమంలో భాగంగా ఆమెకు ఈ అవకాశం ఇచ్చారు. ఈ విషయం జిల్లాతో పాటు రాష్ట్రంలోనూ అధికారులకు మంచి పేరు తెచ్చిపెట్టింది.
ఈ నెల 11న అనంతపురం జిల్లా బాలికకు కలెక్టర్గా పనిచేసేందుకు అధికారులు అవకాశం కల్పించిన విషయాన్ని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఇవాళ ట్వీట్ చేశారు. ప్రభుత్వ శాఖలకు అధినేతలుగా పనిచేసే అవకాశాన్ని అమ్మాయిలకు అధికారులకు కల్పించారంటూ ఇదే న్యూ ఇండియా అంటూ జవదేకర్ ట్వీట్లో పేర్కొన్నారు. కేంద్రమంత్రి స్వయంగా తమ నిర్ణయాన్ని అభినందించడంపై అనంతపురం జిల్లా అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
16-year old M. Sravani, brave daughter of a farm labourer of Anantapur AP, assumed office of Anantapur Dist. Collector on 11th Oct. for one day.
— Prakash Javadekar (@PrakashJavdekar) October 20, 2020
District Administration had decided to give an opportunity to one girl each as head of all govt. offices in the district.#NewIndia pic.twitter.com/zNCv7pqEzg