'వైయస్ జగన్ చెప్పాడా... అయితే ఒకే.. ఇదీ చంద్రబాబు నాయుడు మాట'
అనంతపురం: చంద్రబాబు నాయుడు అంటే మొదట గుర్తుకు వచ్చేది కరువు అని, ఆయన వెంట కరువు మాత్రం ఖాయమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం అన్నారు. అనంతపురంలో జరిగిన సమరశంఖారావంలో ఆయన మాట్లాడారు. కియా ఫ్యాక్టరీలో స్థానికులకు ఐదు శాతం ఉద్యోగాలు ఇవ్వడం లేదన్నారు. చంద్రబాబు మోసం చేసేందుకే పుట్టారన్నారు.
టోపీ వెనుక ఉన్న గుంట నక్కలకు సెల్యూట్ కొట్టవద్దు
పోలవరం ప్రాజెక్టును కట్టకుండానే జాతికి అంకితం చేయడం చంద్రబాబు సినిమాలో మాత్రమే చూశామన్నారు. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టింది చంద్రబాబే అన్నారు. స్థానిక కంపెనీల్లో 75 శాతం లోకల్ రిజర్వేష్ తీసుకొచ్చే చట్టం చేస్తామని చెప్పారు. టోపీపై ఉన్న సింహాలకు పోలీసులు సెల్యూట్ కొట్టాలన్నారు. టోపీ వెనుక ఉన్న గుంట నక్కలకు సెల్యూట్ కొట్టవద్దని చెప్పారు. ప్రతి ఇంట్లో తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఫోటోతో పాటు తన ఫోటో కూడా ఉండాలని చెప్పారు. ఈ తొమ్మిదేళ్లు మీరంతా నాకు అండగా నిలిచారన్నారు.
మోడీ టూర్, వైసీపీ-టీడీపీ మధ్య పోస్టర్ చిచ్చు: పచ్చ పగోడీగాళ్లారా.. దమ్ముంటేరండి.. కొడాలి నాని
జగన్ చెప్పాడా.. అయితే ఓకే
చంద్రబాబు లంచాలు తీసుకొని రాజధాని భూములను అమ్మేసుకుంటున్నారని జగన్ చెప్పారు. రాజధాని ఎక్కడ అంటే బాహుబలి సినిమా చూపిస్తారని, ఆ సెట్టింగ్స్ చూపించి బాగున్నాయా అని అడుగుతారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మన పథకాలను కాపీ చేస్తున్నారని జగన్ ఆరోపించారు. ఆటో వాళ్లకు డబ్బులు, పింఛన్ రెట్టింపు, ప్రతి కులానికి న్యాయం, కులానికి కార్పోరేషన్లు ఏర్పాటు చేయడంపై చంద్రబాబు తీరు ఎలా ఉందంటే... 'జగన్ చెప్పాడా.. జగన్ చెప్పాడు కాబట్టి నేను ఇస్తా' అన్నట్లుగా ఉందన్నారు. అయిదేళ్లు ఏమీ చేయరని, ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, జగన్ చెప్పారు కాబట్టి చేస్తారన్నారు. ఎవరైనా ఐదు బడ్జెట్లు ప్రవేశపెడతారని, కానీ చంద్రబాబు ఆరో బడ్జెట్ ప్రవేశ పెడతారని ధ్వజమెత్తారు.
మనల్ని భోంచేయడానికే రాక్షసుడు
మన పథకాలు చంద్రబాబు కాపీ చేస్తున్నారని, కానీ ఆ కాపీ కూడా సరిగా కొట్టడం చేతకాని వ్యక్తి అని జగన్ అన్నారు. మూడు దశాబ్దాల క్రితం ఎన్టీఆర్ విపక్షంలో ఉన్నప్పుడు రూపాయికి కిలో బియ్యం ఇస్తామని చెప్పారని, దానిని నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కాపీ చేసే ప్రయత్నం చేసిందని, కానీ ఓడిపోయిందని అన్నారు. ఈ సందర్భంగా జగన్.. ఓ రాక్షసుడి కథ చెప్పారు. రాక్షసుడు మనకు ఏదైనా ఇస్తాడని వెళ్తే.. అది పొరపాటు అవుతుందని, ఎందుకంటే ఆయన మనలను భోంచేయడానికి మనకు ఆశ పెడతారన్నారు. ఇప్పుడు చంద్రబాబు తీరు అదే అన్నారు.
జగన్ పథకాలు కాపీ కొట్టడం చేతకాక
చంద్రబాబు ఆరో బడ్జెట్ అంటూ మరో సినిమా తీశారని జగన్ ఆరోపించారు. జగన్ పథకాలు కాపీ కొట్టడం చేతకాక, అందుకోసం ఆరో బడ్జెట్ ప్రవేశ పెట్టారని ధ్వజమెత్తారు. మరో మూడు నెలలు ఆగితే మన ప్రభుత్వం వస్తుందని, అప్పుడు మనం మళ్లీ కొత్త బడ్జెట్ ప్రవేశ పెడతామని జగన్ ప్రకటించారు. ఏపీ ప్రజలంతా నిన్ను నమ్మం బాబు అని అంటున్నారని విమర్శించారు. ఓట్ల విషయంలో టీడీపీ అక్రమాలకు పాల్పడితే ఈసీకి ఫిర్యాదు చేయాలన్నారు.