అనంతలో ఎటూ తెగని టికెట్ల పంచాయతీ.. చంద్రబాబుకు తలనొప్పిగా మారిన గ్రూపు రాజకీయాలు..
అనంతపురంలో జేసీ దివాకర్ రెడ్డికి,జేసీ ప్రభాకర్ చౌదరికి మధ్య ఉన్న విభేదాలు అందరికీ తెలిసిందే. ఒకే పార్టీకి చెందిన నేతలైనా చాలాకాలంగా ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వివాదాలున్నాయి. గతంలో అనంతపురంలో రోడ్ల విస్తరణకు సంబంధించి ఈ ఇద్దరి మధ్య గొడవ రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంచలనమే అయింది. ఇక ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి వారసుడు జేసీ పవన్, ప్రభాకర్ చౌదరి మధ్య కూడా వివాదం రాజుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టికెట్ల కేటాయింపులకు సంబంధించి ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి.
టికెట్లు ఇవ్వాల్సిందేనంటున్న జేసీ.. కుదరదంటున్న ప్రభాకర చౌదరి..
మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో భాగంగా అనంతపురం కార్పోరేషన్లోని కార్పోరేటర్ స్థానాల్లో తాను సూచించినవారికి టికెట్లు ఇవవ్వాలని జేసీ పవన్ ఒత్తిడి తెస్తున్నట్టు అనంత రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. అయితే అనంతపురం అర్బన్ ఇన్చార్జి,మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మాత్రం జేసీ పవన్ తీరును తప్పు పడుతున్నారట. ఎంపీ అభ్యర్థి కార్పోరేషన్ ఎన్నికల్లో తలదూర్చాల్సిన అవసరం లేదని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు,జేసీ పవన్ సూచించిన వ్యక్తులకు టికెట్లు ఇచ్చేది లేదని తెగేసి చెబుతున్నారట. అవసరమైతే రాజీనామా చేయడానికైనా సిద్దమేనని సన్నిహితులతో చెబుతున్నారట.
ఆ ప్రాతిపదికన తమ వర్గీయులకే ఇవ్వాలంటున్న జేసీ
మరోవైపు జేసీ పవన్ వాదన మాత్రం మరోలా ఉంది. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన ప్రభాకర చౌదరి కంటే తనకే ఎక్కువ ఓట్లు వచ్చాయని గుర్తుచేస్తున్నారట. కాబట్టి ఆ ఓటు బ్యాంకును కాపాడుకోవాలంటే.. తన వర్గీయులైన 12మందికి కార్పోరేటర్ స్థానాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. అయితే జేసీ పవన్ వర్గీయులకు సీట్లు ఇచ్చేది లేదని ప్రభాకర చౌదరి తెగేసి చెబుతుండటంతో జిల్లా నాయకత్వం తలలు పట్టుకున్నట్టు సమాచారం. ఈ వివాదం ఇలా నడుస్తుండగానే 40 డివిజన్లలో టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మరో 10 కార్పోరేటర్ స్థానాలకు మాత్రమే నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది.
అధిష్టానానికి మొరపెట్టుకున్న జిల్లా నాయకత్వం
జేసీ పవన్,జేసీ ప్రభాకర చౌదరి వివాదాన్ని పరిష్కరించడం తమవల్ల కాదని జిల్లా నాయకత్వాం అధినేత చంద్రబాబుకు మొరపెట్టుకున్నారట. శుక్రవారమే మున్సిపల్ ఎన్నికల నామినేషన్లకు తుది గడువు కావడంతో.. ఈ వివాదం ఎప్పుడు కొలిక్కి వస్తుంది.. టికెట్ల కేటాయింపు ఎప్పుడు జరుగుతుందని అనంత టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. పైగా సీపీఐతో పొత్తు ఉండటంతో.. మిగిలిన ఆ 10 స్థానాల్లో 3 లేదా 4 స్థానాలు వారికి కేటాయించాల్సి ఉంటుంది. ఇకపోను మిగిలిన ఆరు సీట్ల కోసం ఇంత గొడవ దేనికి అని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది. సామరస్యంగా సీట్ల వ్యవహారాన్ని తేల్చి త్వరగా ఒక నిర్ణయానికి రాకపోతే ఎన్నికల్లో నష్టపోతామని వారు వాపోతున్నట్టు సమాచారం.
Recommended Video
చంద్రబాబుకు తలనొప్పి..
ఒకవేళ నామినేషన్ల వ్యవహారం కొలిక్కి వచ్చినప్పటికీ.. జేసీ పవన్,జేసీ ప్రభాకర్ చౌదరి గ్రూపులుగా చీలిపోయినవారు.. ఎంతవరకు ఒకరికి ఒకరు సహకరించుకుంటారన్నది ప్రశ్నార్థకంగా మారింది. వ్యక్తిగత కక్షలతో ఒక వర్గాన్ని ఇంకొక వర్గం ఓడించే ప్రయత్నం చేస్తే పార్టీకి గట్టి డ్యామేజ్ తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అనంత నేతలను చంద్రబాబు ఎలా కట్టడి చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. అసలే వైసీపీ దూకుడును తట్టుకోలేక రాష్ట్రంలో చాలాచోట్ల నామినేషన్లు వేయడంలో టీడీపీ వెనుకబడింది. ఇలాంటి తరుణంలో సొంత పార్టీ నేతల మధ్య విభేదాలు ఆ పార్టీకి మరింత నష్టం చేసే అవకాశం కనిపిస్తున్నాయి.