నువ్వా..నేనా..సై : తాడిపత్రి-రాప్తాడు లో హోరా హోరీ: గెలుపెవరిదంటే..!
ఎన్నికలు ముగిసాయి. విజయం మాదంటే మాది అంటూ టిడిపి..వైసిపి ధీమా. అయితే, ఈ సారి ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఫలితాల పైన ఎంత ఆసక్తి ఉందో..అదే విధంగా అనంతపురం జిల్లా ఫలితాల మీద అంతకంటే ఎక్కువ ఆసక్తి కనిపిస్తోంది. అందునా..ప్రధానంగా తాడిపత్రి..రాప్తాడు నియోజకవర్గాల్లో గెలుపు మీద భారీ బెట్టింగ్లు జరుగుతున్నాయి. ఇక్కడ ఎవరు గెలిచినా..అయిదు వేల లోపు మెజార్టీ అని చెబుతున్నారు. వారసుల గెలుపు కోసం నేతలు తీవ్రంగా శ్రమించారు. దీంతో..ఇప్పుడు ఆ రెండు నియోజకవర్గాల్లో అంచనాలు ఏంటంటే...
రాప్తాడులో హోరా హోరీ..
అనంతపురం జిల్లాలోనే కాదు..రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది రాప్తాడు నియోకవర్గం. పరిటాల వారసుడు శ్రీరాం తొలిసారి రాప్తాడు బరిలో నిలిచారు. వైసిపి నుండి అక్కడ వరుసగా ఓడిన తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి తిరిగి పోటీలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో తిరిగి పరిటాల సునీతకు టిడిపి తిరిగి టిక్కెట్ కేటాయించింది. రెండు పార్టీలు ఇక్కడ గెలుపు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. పోలింగ్ నాడు చెదురు మదరు ఘటనలు మినహా ప్రశాంతంగా జరిగింది. ఇక, పోలింగ్ ముగిసిన నాటి నుండి గెలుపు పైన ఇద్దరూ ధీమాగా ఉన్నారు. అయితే, పోలింగ్ సరళిని పరిశీలించిన వారు మాత్రం ఇక్కడ పోలింగ్ సైతం ఓటరు నాడి అంతుపట్టని విధంగా సాగిందని చెబుతున్నారు. గెలుపు ఖాయమని చెబుతూనే మెజార్టీ విషయంలో మాత్రం ఆచితూచి స్పందిస్తున్నారు. రాప్తాడులో ఎవరు గెలిచినా అయిదు వేల ఓట్లకు మించి మెజార్టీ ఉండదని స్థానికంగా ఉన్న రెండు పార్టీల నేతలు చెబుతున్నారు.
తాడిపత్రిలో బెట్టింగ్ హోరు..
తాడిపత్రి జెసి కుటుంబానికి కంచుకోట. అటువంటి చోట ఈసారి జేసి ప్రభాకర్ రెడ్డి తనయుడు అస్మిత్ రెడ్డి టిడిపి నుండి బరిలో దిగారు. జేసి బ్రదర్స్ ఇద్దరూ ఎన్నికల బరిలో లేరు. ఇద్దరూ తమ వారసులను ఎన్నికల్లో దింపారు. ఇక, తాడిపత్రి వైసిపి అభ్యర్ది కేతిరెడ్డి పెద్దారెడ్డి పోటీ చేసారు. ఎన్నికలకు ముందు జేసి వర్సెస్ పెద్దారెడ్డి అన్నట్లుగా అక్కడ అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇక, జేసీ క్యాంపులోని పలువురు మద్దతు దారులు ఎన్నికల వేళ వైసిపిలోకి జంప్ అయ్యారు. జేసీ కుటుంబం నుండి కొత్త తరం ప్రతినిధిగా అస్మిత్ రెడ్డి విస్తృత ప్రచారం చేసారు. తన సోదరుడు పవన్ అనంతపురం ఎంపీగా పోటీ చేస్తుండటంతో తన గెలుపుతో పాటుగా తాడిపత్రి నుండి వపన్కు అధిక మెజార్టీ వచ్చేలా ప్రయత్నాలు చేసారు. అయితే, ఈ సారి అస్మిత్..పెద్దారెడ్డి మధ్య హోరా హోరీ పోరు జరగటంతో ఖచ్చితంగా ఎవరు గెలుస్తారని చెప్పలేని పరిస్థితి నెలకొంది. అయితే, అస్మిత్ అనుచరులు మాత్రం గెలుపు ఖాయం అంటున్నారు. ఇక, పోలింగ్ సరళి విశ్లేషణ కష్టంగా ఉందని..ఎవరు గెలిచినా నాలుగు నుండి అయిదు వేల ఓట్ల వరకు మాత్రమే మెజార్టీ ఉంటుందని చెబుతున్నారు.
జిల్లా మొత్తంగా ఎవరి ధీమా వారిదే..
ఇక, జిల్లాలోని మొత్తం 14 నియోజకవర్గాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొని ఉంది. అయితే ప్రధానంగా ధర్మవరం, అనంతపురం అర్బన్, హిందూపూర్ నియోజకవర్గాల పైనే పలువురు ఆసక్తి చూపిస్తున్నారు. ధర్మవరంలో గెలుపు ఖాయమని వైసిపి ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక, అనంతపురం అర్బన్లో సైతం మంచి మెజార్టీ సాధిస్తామని వైసిపి నేతలు చెబుతున్నారు. హిందూపూర్లో గట్టి పోటీ ఇచ్చామని..ఫలితం పైన ఆశలు ఉన్నాయని ఆఫ్ ది రికార్డు వైసిపి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అదే విధంగా టిడిపి సైతం జిల్లాలో మొత్తం 14 సీట్లు గెలుచుకోవటం ఖాయమని చెబుతోంది. ఈ సారి ఎన్నికల్లో ఉరవకొండ నుండి పయ్యావుల గెలుపు ఖాయమని పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో .. ఇప్పుడు రాయలసీమ లో కీలకమైన అనంతపురం జిల్లాలో ఫలితాల పైన ఆసక్తి నెలకొని ఉంది.