వెరీ గుడ్ : అనంతపురం కలెక్టర్ గంధం చంద్రుడుకు సీఎం జగన్ ప్రశంస -ఇలాంటి అవార్డులు మరెన్నో..
వినూత్న కార్యక్రమాలతో ప్రజలకు చేరువవుతూ నిత్యం వార్తల్లో నిలుస్తారు అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు. తాజాగా వ్యవసాయ రంగానికి సంబంధించి కీలక అవార్డును చేజిక్కించుకుని మరోసారి చర్చలోకి వచ్చారాయన.
అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడును ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రశంసించారు. దేశరాజధాని ఢిల్లీలో ప్రతిష్టాత్మక పీఎం కిసాన్ జాతీయ అవార్డు అందుకున్న అనంత కలెక్టర్.. గురువారం తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు.
వ్యవసాయ శాఖ స్పెషల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, అనంతపురం వ్యవసాయ శాఖ జేడీ రామకృష్ణతో కలిసి కలెక్టర్ గంధం చంద్రుడు.. సీఎంను కలవగా, ''వెరీ గుడ్..'' అంటూ చంద్రుడిని సీఎం అభినందించారు.
పీఎం కిసాన్ అవార్డుపై హర్షం వ్యక్తం చేసిన సీఎం జగన్.. ప్రభుత్వ పథకాలన్నింటిని ఇలాగే మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని అనంతపురం కలెక్టర్కు సూచించారు. ఇలాంటివే మరెన్నో రివార్డులు, అవార్డులు సాధించాలని ఆకాంక్షించారు.
గంధం చంద్రుడు మళ్లీ మెరిశాడు -దేశంలోనే టాప్లో అనంతపురం జిల్లా -ప్రతిష్టాత్మక పీఎం కిసాన్ అవార్డు
జాతీయ స్థాయిలో మరే జిల్లాలోనూ లేని విధంగా అనంతపురం జిల్లాలో పీఎం కిసాన్ పథకానికి అర్హులైన వారిలో 28,505 మంది (99.60 శాతం) రైతుల ఫిజికల్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తిచేయడం ద్వారా ఈ ప్రతిష్టాత్మక పీఎం కిసాన్ అవార్డు జిల్లాకు దక్కింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రెండవ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో.. కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చేతుల మీదుగా కలెక్టర్ గంధం చంద్రుడు ఈ అవార్డును అందుకోవడం తెలిసిందే.