అనంతపురం జిల్లాకు వైఎస్ జగన్: ఆ ప్రతిష్ఠాత్మక పథకం ప్రారంభం అక్కడే: చురుగ్గా ఏర్పాట్లు
అనంతపురం: ఇంటింటికీ బియ్యం పంపిణీ పథకం ప్రారంభ కార్యక్రమానికి చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. ప్రజా పంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకుని వచ్చే దిశగా జగన్ సర్కార్ ఈ పథకాన్ని అమలు చేయనుంది. చౌక ధరల దుకాణాల ద్వారా అందించే బియ్యాన్ని తెల్లరేషన్ కార్డుదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పంపిణీ చేయడానికి ఉద్దేశించిన ఈ పథకం ఫిబ్రవరి 1న ఆరంభం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా దీన్ని ప్రారంభించనున్నారు. దీనికోసం ఆయన అనంతపురం జిల్లాకు వెళ్లనున్నారు. కదిరిలో ఈ పథకాన్ని ప్రారంభిస్తారు.
ఇంటింటికీ బియ్యాన్ని పంపిణీ చేయడానికి అవసరమైన వాహనాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. వైఎస్ జగన్.. ఈ నెల 21వ తేదీన విజయవాడలోని బెంజ్ సర్కిల్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. కృష్ణా, గుంటూరు పశ్చిమ గోదావరి జిల్లాలకు కేటాయించిన 2,500 బియ్యం పంపిణీ వాహనాలను ఆయన ఒకేసారి అందుబాటులోకి తెచ్చారు. అదే రోజు రాష్ట్రవ్యాప్తంగా 9260 వాహనాలు రోడ్డెక్కాయి. ఇక ఈ పథకం మలిదశలో భాగంగా.. బియ్యం పంపిణీని ముఖ్యమంత్రి.. కదిరిలో ప్రారంభిస్తారు. దీనికి అవసరమైన ఏర్పాట్లు సాగుతున్నాయి.
కదిరి పట్టణంలోని వేమన ప్రభుత్వ పాఠశాల లేదా ప్రభుత్వ డిగ్రీ కళాాశాల మైదానంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు. వైఎస్సార్సీపీకి చెందిన కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పీ వెంకట సిద్ధారెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు ఈ మైదానాలను పరిశీలించారు. ముఖ్యమంత్రి కార్యాలయం సూచనల మేరకు ఈ రెండింట్లో ఒక గ్రౌండ్ను ఎంపిక చేయాల్సి ఉంది. బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం బహిరంగ సభను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు.
జిల్లాకు చెందిన మంత్రి శంకర నారాయణ, పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, అనంతపురం, హిందూపురం లోక్సభ సభ్యులు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఇందులో పాల్గొంటారు. రాష్ట్రవ్యాప్తంగా 4,93,422 మంది తెల్లరేషన కార్డుదారులు ఉండగా.. వారిలో 26,39,363 మందికి తొలివిడతలో బియ్యాన్ని వారి గుమ్మం వద్దకే అందజేస్తారు. మలి విడతలో మిగిలిన లబ్దిదారులకు బియ్యం పంపిణీ ఇంటివద్దకే అందుతుంది. నెలలో 15 నుంచి 18 రోజులపాటు బియ్యం పంపిణీ కార్యక్రమం ఉంటుందని ప్రభుత్వం ఇదివరకే వెల్లడించింది.