కొట్టిన కొబ్బరికాయ చిప్ప ఎగిరిపడి.. ఎంబీఏ విద్యార్థిని మృతి.. ఆరుగురికి తీవ్రగాయాలు
బుక్కరాయసముద్రం : విధి రాసిన రాతను ఎవరూ తప్పించుకోలేరంటారు పెద్దలు. ఆ క్రమంలో అనంతపురం జిల్లాలోని బుక్కరాయసముద్రం మండలంలో జరిగిన ఘటన స్థానికంగా విషాదం నింపింది. ఎవరో కొట్టిన కొబ్బరికాయ చిప్ప ఎగిరిపడి ఎంబీఎ విద్యార్థిని ప్రాణాలు తీసింది.
8వ తరగతి గది.. ప్రేమ చిగురించిన చోటే ప్రేమికుల ఆత్మహత్య
ఆటో ప్రయాణంలో..!
అనంతపురం రూరల్ మండలం తాటిచెర్ల గ్రామానికి చెందిన పెద్దన్న ఆటో నడుపుతూ జీవనోపాధి పొందుతున్నాడు. గార్లదిన్నె - అనంతపురం మధ్య రోజువారి ట్రిప్పులు వేస్తున్నాడు. అదే క్రమంలో గార్లదిన్నె ప్రైమరీ హెల్త్ సెంటర్కు చెందిన ఏఎన్ఎంలు ముగ్గురు, ఫార్మాసిస్టులు ఇద్దరు అనంతపురం వెళ్లడానికి పెద్దన్న ఆటోలో ఎక్కారు. వారితో పాటు రొద్దం మండలం సొలెమర్రి గ్రామానికి చెందిన ఎంబీఏ విద్యార్థిని అశ్విని.. వడియంపేటలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో సప్లిమెంటరీ పరీక్షలు రాసి తిరుగు ప్రయాణంలో ఇదే ఆటో ఎక్కింది.
ప్రాణం తీసిన దిష్టి మొక్కు
సోములదొడ్డి దాటి తడకలేరు దగ్గరకు ఆటో చేరుకోగానే ఊహించని ప్రమాదం ఎదురొచ్చింది. ఆలయం సమీపించగానే గుంతకల్లు వెళుతున్న ఆర్టీసీ బస్సులో నుంచి ఎవరో టెంకాయను విసిరారు. దిష్టి మొక్కులో భాగంగా బస్సు దిగకుండానే అందులో నుంచి రోడ్డుపైకేసి బలంగా కొట్టారు. అయితే ఆ పగిలిన కొబ్బరి చిప్పలు వేగంగా దూసుకొచ్చి ఆటోకు తగలడంతో ముందుభాగంలోని అద్దం పగిలిపోయింది.
కొబ్బరి చిప్పలు తగిలి.. ఆటో బోల్తా కొట్టి
ఊహించని సంఘటనతో ఆటో డ్రైవర్ పెద్దన్న ఒక్కసారిగా షాక్ తిన్నాడు. ఆ క్రమంలో ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. దాంతో ఆటోలో ఉన్న వారందరికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడి స్థానికులు వెంటనే స్పందించి గాయపడ్డవారిని అనంతపురంలోని సర్వజనా ఆసుపత్రికి తరలించారు. అయితే ఎంబీఏ విద్యార్థిని అశ్విని పరిస్థితి విషమించడంతో ఆమె చనిపోయింది. ఆటో డ్రైవర్తో పాటు మిగిలిన ఆరుగురికి వైద్యం అందిస్తున్నారు డాక్టర్లు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటన జరిగిన తీరుపై ఆరా తీస్తున్నారు.