కొత్తగా పెనుకొండ జిల్లా.. ఆయన పేరు: వైఎస్ జగన్కు వంశీయుల లేఖ: చరిత్రలో మీ పేరు కూడా
అనంతపురం: రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఇంకా ఆరంభం కావాల్సి ఉంది. ఈ ప్రక్రియ జనవరి చివరి వారం నాటికి పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనికోసం ప్రభుత్వం ప్రత్యేకంగా కమిటీని నియమించింది. జిల్లాల ఏర్పాటుపై ఈ కమిటీ అధ్యయనం చేస్తోంది. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఒక్కో లోక్సభ నియోజకవర్గాన్ని కేంద్రంగా చేసుకుని..దాని పరిధిని కొత్త జిల్లాగా ప్రకటిస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఇదివరకు ప్రతిపక్ష నేత హోదాలో చేపట్టిన పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రక్రియ ఆరంభమైంది.
భౌగోళిక, చారిత్రక అంశాలు పరిగణనలోకి..
కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ తప్పు పట్టడం, స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసేంత వరకూ పునర్విభజన సాధ్యం కాదని స్పష్టం చేయడం తెలిసిందే. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ సందర్భంగా పలు డిమాండ్లు తలెత్తాయి. భౌగోళిక, చారిత్రక ప్రాధాన్యత ఉన్న ప్రాంతాలు..విచ్ఛిన్నం అవుతాయనే ఆందోళనలు ఇప్పటికే వ్యక్తం అయ్యాయి. వాటిని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందనే అభిప్రాయాలు వెల్లడయ్యాయి. భౌగోళికంగా లోక్సభ నియోజకవర్గానికి దూరంగా ఉన్న పట్టణాన్ని జిల్లా కేంద్రంగా మార్చాల్సి ఉంటుందనే డిమాండ్లు వినిపించాయి.
పెనుకొండ కూడా..
అదే వరుసలో మరో డిమాండ్ కొత్తగా వినిపిస్తోంది. అనంతపురం జిల్లాలో పెనుకొండ ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని, దానికి విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయల వారి పేరును పెట్టాలనే డిమాండ్ తలెత్తింది. అనంతపురంలోని హిందుపురం లోక్సభ నియోజకవర్గాన్ని జిల్లాగా ప్రకటించాలనే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద ఉంది. కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా అనంతపురం జిల్లా రెండుగా మారుతుంది. పెనుకొండ నియోజకవర్గం.. హిందూపురం జిల్లా పరిధిలోకి వస్తుంది. హిందుపురం టౌన్, కదిరి, ధర్మవరం, పుట్టపర్తి, మడకశిర నియోజకవర్గాలు దీనికి కిందికి వస్తాయి.
జగన్కు రాయలవారి వంశీయులు లేఖ..
హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా గుర్తిస్తూనే.. దానికి అదనంగగా పెనుకొండకు కూడా ఆ హోదా కల్పించాలని శ్రీకృష్ణ దేవరాయల వంశీయులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. పెనుకొండ పట్టణానికి చారిత్రక ప్రాధాన్యత ఉంది. చారిత్రాత్మక హంపి తరువాత పెనుకొండ.. విజయనగర సామ్రాజ్యానికి రెండో రాజధానిగా వర్ధిల్లింది. శ్రీకృష్ణదేవరాయల వారి వేసవి విడిదిగా గుర్తింపుపొందింది. విజయనగర రాజులు నిర్మించిన చారిత్రక కట్టడాలు, దేవాలయాలు పెనుకొండలో ఉన్నాయి. అందుకే- ఇదివరకు రాయలవారి ఉత్సవాలను పెనుకొండలో నిర్వహించారు. రాయలవారి నిలువెత్తు విగ్రహాన్ని పెనుకొండలో ఏర్పాటు చేశారు.
తెలుగు ప్రలు తమ వాడిగా..
శ్రీకృష్ణ దేవరాయల వారిని తెలుగు ప్రజలు తమ వాడిగా భావిస్తారని ఆయన వంశీయులు పేర్కొన్నారు. తాను స్వయంగా పరిపాలించిన, నివసించిన పెనుకొండను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఆయన వంశీయులు కృష్ణ దేవరాయ విజ్ఙప్తి చేశారు. ఈ మేరకు ఆయన వైఎస్ జగన్కు లేఖ రాశారు. ఆదర్శ పరిపాలకుడిగా సమర్థుడైన చక్రవర్తిగా చరిత్రలో నిలిచిపోయిన శ్రీకృష్ణ దేవరాయలవారి పేరుతో జిల్లాను ఏర్పాటు చేయడం వల్ల ఆయనకు సముచితమైన గుర్తింపును ఇచ్చినట్టవుతుందని పేర్కొన్నారు. వైఎస్ జగన్ పేరు కూడా నిలిచిపోతుందని అన్నారు.