అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో మంటలు: సకాలంలో: పేషెంట్లు సేఫ్
అనంతపురం: విజయవాడలోని హోటల్ స్వర్ణ ప్యాలెస్లో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్లో సంభవించిన అగ్నిప్రమాదానికి సంబంధించిన ప్రకంపనలు ఇంకా తగ్గక ముందే.. అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం సంభవించంది. రికార్డు రూమ్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణాపాయం సంభవించలేదు. ముందుజాగ్రత్త చర్యగా కరోనా వైరస్ సోకిన పేషెంట్లను వేరే వార్డుకు తరలించారు. జిల్లా అధికార, పోలీసు యంత్రాంగం సకాలంలో స్పందించి, మంటలను అదుపు చేయగలిగారు.
మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఈ ఘటన చోటు చేసుకుంది. ఆసుపత్రిలో రికార్డులను భద్రపరిచే గదిలో అగ్నిప్రమాదం సంభవించింది. దట్టమైన పొగలు అలముకున్న వెంటనే మంటలు చెలరేగాయి. షార్ట్సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ గది ఆనుకుని కోవిడ్ వార్డు ఉండటం, అందులో 18 మంది పేషెంట్లు చికిత్స పొందుతుండటం ఆందోళనకు దారి తీసింది. మంటలు చెలరేగిన వెంటనే నైట్ డ్యూటీలో ఉన్న ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తం అయ్యారు.
పోలీసులు, అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. రికార్డు రూమ్ మంటల్లో కాలిపోయింది. అగ్నికీలలు బయటి దాకా వ్యాప్తి చెందకుండా అగ్నిమాపక సిబ్బంది నిరోధించగలిగారు. దీనితో పెను ప్రమాదం తప్పింది. ఈ సమాచారం అందుకున్న వెంటనే అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ సూర్య, జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు, అనంతపురం ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు.
ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, మంటలు వ్యాపించకుండా అరికట్టామని వారు చెప్పారు. కొద్దిరోజుల కిందటే విజయవాడలోని హోటల్ స్వర్ణ ప్యాలెస్ హోటల్లో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్లో అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 10 మంది మరణించారు. రమేష్ ఆసుప్రతుల యజమాని డాక్టర్ రమేష్ పోతినేని ఈ కోవిడ్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఆయనతో పాటు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.