వామ్మో.. వంట గదిలో కరెంట్ పోల్.. చూని ఆశ్చర్యపోయిన ఎమ్మెల్యే.. ఎలా అంటే..
వంట గదిలో కరెంట్ పోల్.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇదీ నిజం. అనంతపురం జిల్లాలో ఓ ఇంటిలో విద్యుత్ స్తంభం కూడా భాగమైపోయింది. వంటింట్లో విద్యుత్ స్తంభం ఉండడం ప్రధాన సమస్యగా మారింది. విద్యుత్ స్తంభాన్ని చూసి ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి ఆశ్చర్యపోయారు. ఏం జరిగిందో అని తెలుసుకున్నారు. సమస్యను తక్షణమే పరిష్కరిస్తామని పేర్కొన్నారు.
15 ఏళ్ల క్రితం ఇంటి స్థలం
అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గ పరిధి గొట్లూరు గ్రామంలో భాగ్యమ్మకు 15 ఏళ్ల క్రితం ప్రభుత్వం ఇంటి కోసం స్థలం మంజూరు చేసింది. ఆ స్థలంలో విద్యుత్ స్తంభం ఉంది. ఆమె అప్పుడే ఆ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ స్పందించలేదు. దీంతో చేసేది లేక ఎలాగోలా అక్కడే ఇల్లు నిర్మించుకున్నారు. ఇంటి నిర్మాణంలో ఆ విద్యుత్ స్తంభం వంట ఇంట్లో భాగమైపోయింది.
విద్యుత్ స్తంభంతో జీవనం..
గత 14 ఏళ్లుగా వంట ఇంట్లో ఆ విద్యుత్ స్తంభంతో భాగ్యమ్మ భయం భయంగా జీవనం సాగిస్తోంది. ఆ విద్యుత్ స్తంభం ఇనుముతో తయారైనది కావడంతో వర్షం పడితే కంటిమీద కునుకు లేకుండా ఉండే పరిస్థితి ఏర్పడింది. వర్షాకాలంలో వంటింట్లోకి వెళ్లి వంట చేసే పరిస్థితి లేదని, ఆ సమయంలో పక్కింటి వాళ్ల సాయంతో కడుపు నింపుకునే వాళ్లమని భాగ్యమ్మ ఆవేదన వ్యక్తం చేస్తోంది.
చూసి నోరెళ్లబెట్టిన ఎమ్మెల్యే
ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి 'గుడ్ మార్నింగ్ ధర్మవరం' కార్యక్రమంలో భాగంగా ఇటీవల గొట్లూరు గ్రామానికి వెళ్లారు. ఆ సమయంలో బాధితురాలు భాగ్యమ్మ ఎమ్మెల్యేతో తన గోడును వెళ్లబోసుకుంది. వంట ఇంట్లో ఉన్న ఆ విద్యుత్ స్తంభాన్ని చూసి ఎమ్మెల్యే షాకయ్యారు. దానికి అధికారులు ఎలా అనుమతి ఇచ్చారని విస్మయం వ్యక్తం చేశారు. విద్యుత్ స్తంభాన్ని తొలగించి ఇంటి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. వారంలో రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు.