ఏపీలో ఆ పొలాల్లో తళుక్కుమంటున్న వజ్రాలు .. మహిళా కూలీకి దొరికిన వజ్రం.. అదృష్టమంటే ఇదే !!
తొలకరి వర్షాలు పలకరిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో తొలకరి వర్షాలతో రైతులు సంతోషంగా ఉన్నారు. అయితే కర్నూలు , అనంతపురం జిల్లా వాసులు మాత్రం ఇప్పుడు అదృష్ట లక్ష్మి కోసం ఆశగా ఎదురు చూస్తుంటారు. కొద్దిపాటి వర్షాలు కురిశాయంటే చాలు కర్నూలు, అనంతపురం వాసులు పిల్లాపాపలతో సహా వచ్చి అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. రోజంతా పొలంలోనే ఉండి తళతళ మెరిసే రాళ్ల కోసం, వజ్రాల కోసం వెదుకులాట కొనసాగిస్తారు .
అనంత , కర్నూలు వాసుల వజ్రాల వేట
ఈ అన్వేషణ ప్రతీ సంవత్సరం జరుగుతుంది . ఈ సంవత్సరం కూడా తొలకరి వర్షాలు పలకరిస్తుంటే అనంత , కర్నూలువాసులు వజ్రాల వేట ప్రారంభించారు. అనంత పురం జిల్లా వజ్రకరూరు మండలంలో తొలకరి వర్షాల సమయంలో వజ్రాలు దొరుకుతాయి. దీంతో ప్రతి ఏటా ఇక్కడ వజ్రాల కోసం అన్వేషణ సాగిస్తారు స్థానికులు. సాధారణంగా తొలకరి వర్షాలు ప్రారంభం కాగానే ఈ అన్వేషణ మొదలవుతుంది . ఒక్క వజ్రం దొరికితే చాలు జాతకం మారిపోతుందని చాలా ఆశగా వెతుకుతారు. ఇప్పటికే ఈ మధ్య కాలంలో ఇద్దరు, ముగ్గురికి వజ్రాలు దొరికాయని తెలుస్తుంది.
ఒక్క వజ్రం దొరికినా కష్టాలు తీరిపోతాయని ఆశ
వజ్రకరూర్ సమీపంలోని పొలాల్లో వజ్రాల కోసం ప్రతి ఏడాది అన్వేషణ సాగుతుంది .ఒక్క వజ్రం దొరికినా కష్టాలు తీరిపోతాయని భావించి చీకటి పడేవరకు వజ్రాల కోసం వేట సాగిస్తారు. ఇటీవల ఒక గొర్రెల కాపరికి ,ఇద్దరు వ్యవసాయ కూలీలకు వజ్రాలు దొరికాయి. ఇక తాజాగా కర్నూలు జిల్లా తుగ్గిలి మండలం రామాపురం గ్రామానికి చెందిన ఓ మహిళా కూలీకి కూడా వజ్రం దొరికింది. కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగించే ఆమె వేరుశనగ పొలంలో విత్తనాలు నాటేందుకు వెళ్ళింది.
మహిళా కూలీకి దొరికిన వజ్రం
విత్తనాలు నాటే సమయంలో ఆ మహిళా కూలీకి ఓ వజ్రం దొరికిందని సమాచారం. ఆ వజ్రాన్ని ఆ రాత్రే ఆమె అనంతపురం జిల్లా గుత్తి తీసుకొని వెళ్లి ఓ వ్యాపారికి అమ్మేసింది. రూ.5.5 లక్షలు, మూడు తులాల బంగారం ఇచ్చి ఆ వ్యాపారి ఆమె వద్ద నుంచి వజ్రం కొనుగోలు చేశాడు. దీంతో రెక్కాడితే కాని డొక్కాడని సదరు మహిళ రాత్రికి రాత్రే లక్షాధికారి అయ్యింది. కూలిపనులు చేసుకునే మహిళకు వజ్రం దొరికిందనే విషయం బయటకు తెలియడంతో ఒక్కసారిగా ఈ విషయం వైరల్ అయ్యింది.
కాచుకు కూర్చునే వజ్రాల వ్యాపారులు
వర్షాకాలం ప్రారంభంలో కర్నూలు, అనంతపురం జిల్లాలలో వజ్రాలు దొరుకుతాయి కాబట్టి వజ్రాల వ్యాపారులు ఈ సమయంలో కాచుకు కూర్చుంటారు . అంతే కాదు ఒక్క వజ్రం దొరికినా దశ మారుతుందని భావించి చాలా మంది ఈ సమయంలో వజ్రాల వేట కోసం కర్నూలు, అనంతపురం తరలి వెళ్తారు . రాత్రనక పగలనక పొలాల్లో తెగ అన్వేషణ సాగిస్తారు .