అనంతలో టీడీపీకి డబుల్ షాక్ : పార్టీకి తల్లి..కుమార్తెల దూరం : వైసీపీలోకి ఎంట్రీ..!
స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో టీడీపీ నుండి నేతల వలసలు కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటికే రాయలసీమలో సీఎం సొంత జిల్లా నుండి కీలక నేతలు వైసీపీ బాట పట్టారు. ప్రకాశం నుండి ఇద్దరు ముఖ్య నేతలు వైసీపీకి దగ్గరయ్యారు. ఇక, ఇప్పుడు సీమ ప్రాంతంలో టీడీపీకి పట్టు ఉన్న అనంతపురం జిల్లాలో ఇద్దరు మహిళా నేతలు పార్టీ వీడేందుకు సిద్దమయ్యారు.
కార్యకర్తలతో భేటీ అయిన శమంతకమణి
అనంతపురం జిల్లా శింగనమల మాజీ ఎమ్మెల్యేలుగా పని చేసిన శమంతకమణి.. ఆమె కుమార్తె యామినీ బాల టీడీపీ వీడటం ఖాయంగా కనిపిస్తోంది. ఎమ్మెల్సీగా ఉన్న శమంతకణి.. ఆమె కుమార్తె యామినీ బాల వైసీపీలో చేరేందుకు రంగం సిద్దమైంది. జనవరిలో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మూడు రాజధానుల బిల్లుల సమయంలోనే శమంతకమణి టీడీపీ సమావేశానికి గైర్హాజరయ్యారు. అనారోగ్య కారణాలతో హాజరు కాలేదని చెప్పుకొచ్చారు. అయితే, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో తమ సొంత నియోజకవర్గమైన శింగనమల కార్యకర్తలతో వారిద్దరూ సమావేశాలు జరుపుతున్నారు. ఒకటి రెండు రోజుల్లోనూ వారిద్దరూ వైసీపీలో చేరనున్నట్లుగా తెలుస్తోంది.
తల్లి..కుమార్తెలు వైసీపీలోకి...
శమంతకమణి తొలిగా కాంగ్రెస్ నుండి 1985లో పోటీ చేసి ఓడారు. తిరిగి 1989లో కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పని చేసారు. ఆ తరువాత టీడీపీలో చేరారు. 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన శమంతకమణి కాంగ్రెస్ అభ్యర్ధి ..ప్రస్తుత పీసీసీ చీఫ్ శైలజానాద్ చేతిలో ఓడిపోయారు. ఇక, 2014 ఎన్నికల్లో శమంతకమణి కుమార్తె యామినీ బాల టీడీపీ నుండి పోటీ చేసి వైసీపీ అభ్యర్ధి జొన్నలగడ్డ పద్మావతి పైన గెలుపొందారు. చంద్రబాబు ప్రభుత్వంలో విప్ గా పని చేసారు. ఇక, 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి జొన్నలగడ్డ పద్మావతి అక్కడ నుండి యామినీ బాల మీద గెలుపొందారు. అయితే, కొద్ది రోజులుగా వారు టీడీపీకి దూరమయ్యే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. నాలుగు రోజులుగా వారిద్దరూ తమ అనుచరులతో మంతనాలు సాగిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల పైనా వారు టీడీపీ తరపున ఆసక్తిగా పని చేయట్లేదని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. దీంతో.. వారు వైసీపీలో చేరటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.
Recommended Video
ఎమ్మెల్సీ పదవి సైతం కోల్పోవటంతో..
శమంతకమణికి టీడీపీ నుండి రెండు సార్లు ఎమ్మెల్సీగా నియమితులయ్యారు. ప్రస్తుతం మండలి సభ్యురాలిగానే ఉన్నారు. అయితే, మండలిని రద్దు చేస్తూ శాసనసభలో తీర్మానం చేయటం ద్వారా ...ఇక అధికార పార్టీలో చేరటం మంచిదనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తో ఇప్పటికే శమంతకమణి మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ రోజు కార్యకర్తలతో సమావేవం అవుతున్న శమంతక మణి..యామినీ బాల ఇద్దరూ ఈ సాయంత్రం తమ నిర్ణయం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.