ప్రతీ చేనేత కుటుంబానికి రూ.24 వేలు, చేతివృత్తులను నిలబెట్టేందుకు కంకణం, జగన్పై కేతిరెడ్డి ప్రశంసలు
హైదరాబాద్లో దొరికే ప్రతీ చీర ధర్మవరం చేనేత కార్మికులు నేసినదేనని, కానీ ధర్మవరం బ్రాండ్ను ప్రమోట్ చేసుకోలేకపోయామని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అన్నారు. ఇప్పుడే కాదు ఎప్పటినుంచో పట్టుచీరలకు ధర్మవరం పెట్టింది పేరు అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా వైఎస్ఆర్ నేతన్న నేస్తం కార్యక్రమాన్ని ధర్మవరంలో ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి మాట్లాడుతూ.. కార్మికులకు ప్రభుత్వం అండగా నిలువాల్సిన అవసరం ఉందన్నారు.
చేనేతపై జగన్ సంచలన నిర్ణయం .. నవంబర్ 1 నుండి ఆన్లైన్ లో చేనేత అమ్మకాలు
జనం మధ్య..
సాధారణంగా పుట్టినరోజును.. విదేశాల్లో కుటుంబంతో జరుపుకుంటారని ఎమ్మెల్యే కేతిరెడ్డి గుర్తుచేశారు. కానీ సీఎం జగన్ మాత్రం ప్రజల మధ్య జరుపుకుంటున్నారని, అదే జగన్కు మిగతా నేతలకు తేడా అని చెప్పారు. ప్రతీ చేనేత కుటుంబానికి ఒకేసారి రూ.24 వేల జమచేస్తున్నామని చెప్పారు. దీంతో 85 వేల చేనేత కుటుంబాలకు మేలు జరుగుతుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో నేతన్నలను పట్టించుకోలేదని చెప్పారు. 37 రోజుల దీక్ష చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
పేరు లేకపోవడంతో..
ముడిసరుకుల ధర పెరగడం, నేసిన చీరకు సరైన ధర పలకడం లేదని కేతిరెడ్డి చెప్పారు. ధర్మవరం చీరలకు తగిన పాపులారిటీ రాలేదని, ఇక్కడ చీరలను రూ.20 వేలకు కొనుగోలు చేసి, రూ.లక్షలకు విక్రయించి వ్యాపారులు సొమ్ముచేసుకుంటున్నారని తెలిపారు. ధర్మవరం చీరలకు బ్రాండ్ ఉంటే నేత కార్మికులకు మేలు జరుగుతుందని చెప్పారు.
రుణ బాధలు..
నేతన్నలకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని.. రుణాలు ఇచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ను కోరారు. ఎన్నికల్లు వస్తేనే ప్రతిపక్ష నేత చంద్రబాబుకు హామీలు గుర్తుకొస్తాయని చెప్పారు. తర్వాత మరచిపోతారని.. గత ప్రభుత్వం కూడా పట్టించుకోలేదని విమర్శించారు. చంద్రబాబు అధికారం చేపడితే కరువు వస్తుందనే మండిపడ్డారు.
ఆర్థిక భరోసా..
చేనేత కార్మికుల ఇబ్బందులను స్వయంగా చూసిన జగన్ మోహన్ రెడ్డి.. వారిని ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. చేనేతే కాదు చేతివృత్తులను నిలబెట్టేందుకు కంకణం కట్టుకున్నారని పేర్కొన్నారు. అన్నీ వృత్తుల వారికి ఆర్థిక సాయం చేస్తున్నారని గుర్తుచేశారు. అనంతపురం జిల్లాలో 27 వేల 333 మంది చేనేత కార్మికులకు రూ.65 వేల కోట్లు మంజూరు చేశామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 85 వేల చేనేత కుటుంబాలకు రూ.196 కోట్లు విడుదల చేస్తున్నామని తెలిపారు.
బీమా పెంపు
ధర్మవరం చేనేత కార్మికులు అగ్గిపెట్టేలో ఇమిడే చీరను నేశారని గుర్తుచేశారు. ఉంగరం నుంచి వెళ్లే వస్త్రాలను కూడా వేశారని ఎమ్మెల్యే కేతిరెడ్డి చెప్పారు. ప్రమాదవశాత్తు చేనేత కార్మికులు చనిపోతే జీవిత బీమాను కూడా పెంచామని చెప్పారు. రూ.లక్షన్నర నుంచి ఐదు లక్షలకు పెంచామని తెలిపారు. దీంతో ఆయా కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తోందని చెప్పారు.