అనంతలో ఫేక్ కరెన్సీ కలకలం: రూ.10 లక్షల విలువగల రూ.500 నోట్లు..
అనంతపురంలో నకిలో నోట్లు కలకలం రేపాయి. జాతీయ రహదారిపై భారీగా ఫేక్ కరెన్సీ కనిపించాయి. నకిలీ నోట్లు రూ.500 కట్టలు ఉన్నాయి. వాటిని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. నేషనల్ హైవేపైకి వచ్చిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆ నోట్ల విలువ రూ.10 లక్షల వరకు ఉంటుందని చెప్పారు.
రాయదుర్గం మండలం రహదారిపై నకిలీ నోట్లు కనిపించాయి. వడ్రవన్నూరు శివారులో నోట్ల కట్టలను గుర్తు తెలియని వ్యక్తులు పడేసినట్టు తెలుస్తోంది. బొమ్మకపల్లి, 74 ఉడేగోళం గ్రామానికి చెందిన కొందరు నోట్లను తీసుకున్నారని సమాచారం. అయితే నోట్ల కట్టలపై మిగతావారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వారు వచ్చి నోట్లను తీసుకొని.. ఇవీ ఇక్కడికీ ఎలా వచ్చాయనే అంశంపై ఆరా తీస్తున్నారు.
పెద్ద నోట్ల రద్దు తర్వాత ఫేక్ కరెన్సీ ఎక్కువ పట్టుబడుతోంది. బెంగాల్ మీదుగా చెలామణి కూడా అవుతోంది. చాలా సందర్భాల్లో నోట్లను పోలీసులు పట్టుకున్నారు. కానీ ఈ సారి జాతీయ రహదారిపై పడేయడంతో పలు ప్రశ్నలు తలెత్తున్నాయి. దీనిపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.