అనంతపురం జిల్లాలో నలుగురు వైద్యసిబ్బందికి కరోనా పాజిటివ్- కలెక్టర్ ప్రకటన
ఏపీలో కరోనా వైరస్ కేసులు ఇప్పటివరకూ ఢిల్లీతో పాటు విదేశాలకు వెళ్లి వచ్చిన వారికి, సమీప బంధువులకు, సన్నిహితులకు మాత్రమే పరిమితం కాగా... ఇవాళ అనంతపురం జిల్లాలో నలుగురు వైద్య సిబ్బందికీ సోకింది. అనంతపురం సర్వజన ఆస్పత్రిలో చేరిన కరోనా రోగులకు వైద్యం అందిస్తున్న క్రమంలో వీరికి వైరస్ సోకినట్లు తెలుస్తోంది.
ఏపీలో వైద్య సిబ్బందికీ పాకిన కరోనా..
ఏపీలో ఇప్పటివరకూ కరోనా సోకిన బాధితులు, వారి సన్నిహితులకు మాత్రమే వైరస్ సోకినట్లు నిర్ధారణ కాగా.. తాజాగా అనంతపురం జిల్లాలో రోగులకు వైద్యం అందిస్తున్న నలుగురు వైద్య సిబ్బందికి కూడా పాజిటివ్ గా తేలారు. అనంతపురం నగరంలోని సర్వజన ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు వైద్యం అందిస్తున్న నలుగురు వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు కలెక్టర్ గంధం చంద్రుడు ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా జిల్లాలో కలకలం రేగింది.
అనంతపురంలో ఇవాళ 7 కొత్త కేసులు..
అనంతపురం జిల్లాలో నలుగురు వైద్య సిబ్బందితో పాటు మొత్తం ఏడుగురికి ఇవాళ కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు కలెక్టర్ ప్రకటించారు. ఇందులో అనంతపురం సర్వజన ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సిబ్బందే నలుగురు కాగా.. హిందూపురంలో రెండు, కళ్యాణ దుర్గంలో మరొకరు ఉన్నారు. వీరితో కలిపి జిల్లాలో ఇప్పటివరకూ కరోనా పాజిటివ్ గా తేలిన వారి సంఖ్య 13కు చేరింది.