తాడిపత్రిలో హైటెన్షన్: ఒక్క మండలంలో 300 మంది కేంద్ర బలగాలు
Recommended Video
అనంతపురం: జిల్లాలోని సమస్యాత్మక నియోజకవర్గాల్లో టాప్ లో ఉన్న తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు ఏ మాత్రం సడల్లేదు. దాడులు, ప్రతిదాడులతో అట్టుడికిపోయిన వీరాపురం మండలంలోని గ్రామాల్లో ఎప్పుడేమి జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. తాడిపత్రి నియోజకవర్గం పరిధిలోని వీరాపురంలో తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య గురువారం పోలింగ్ సందర్భంగా చెలరేగిన హింసాత్మక ఘటనలకు సంబంధించిన ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది.
ఘటన చోటు చేసుకుని 24 గంటలు దాటినప్పటికీ..అక్కడి పరిస్థితుల్లో మార్పు రాలేదు. వీరాపురం మండలంలోని అనేక గ్రామాలు నివురు గప్పిన నిప్పులా తయారయ్యాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. దాడులు, ప్రతిదాడులను నివారించడానికి పెద్ద ఎత్తున భద్రతా బలగాలను తరలించారు. హింసాత్మక ఘటనకు కేంద్రబిందువైన వీరాపురం మండలంలో 300 మంది కేంద్ర బలగాలను మోహరింపజేశారు.
వీరాపురం మండలంలో పోలింగ్ సందర్భంగా పెద్ద ఎత్తున ఘర్షణలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస పార్టీ కార్యకర్తలు పరస్పరం మారణాయుధాలతో దాడులకు దిగారు. వేట కొడవళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో టీడీపీకి చెందిన భాస్కర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీకి చెందిన పుల్లారెడ్డి అనే ఇద్దరు స్థానికులు మరణించారు. అనంతరం దాడులు, ప్రతిదాడులు జరిగే అవకాశం ఉండే పరిస్థితులు మండలంలో నెలకొన్నాయి.
ప్రతీకార దాడులు చోటు చేసుకునే ప్రమాదం ఉండటంతో కర్నూలు రేంజీ డీఐజీ, జిల్లా ఎస్పీ, అదనపు ఎస్పీ తాడిపత్రిలో మకాం వేశారు. పరిస్థితులు అదుపు తప్పకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. రాత్రికి రాత్రి 300 మంది కేంద్ర బలగాలను వీరాపురానికి తరలించారు. పోలీస్ పికెట్ ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకనప్పటికీ.. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థి నెలకొంది. దీనితో పరిస్థితులు పూర్తిగా సద్దుమణిగేంత వరకూ భద్రతా బలగాలను కొనసాగిస్తామని జిల్లా పోలీసులు చెబుతున్నారు.