వీడియో: కోడెల ఏదో ఒకరోజు ఆత్మహత్య చేసుకుంటారని అనుకున్నా: దరిద్రాలన్నీ నెత్తి మీద పడ్డాయ్!
అనంతపురం: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, అసెంబ్లీ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య ఉదంతంపై అదే పార్టీకి చెందిన నాయకుడు, మాజీమంత్రి జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అనూహ్యంగా స్పందించారు. కోడెల ఆత్మహత్య చేసుకుంటారని తాను ఎప్పుడో అనుకున్నానని అన్నారు. కొన్ని దరిద్రాలు ఆయన నెత్తి మీద వచ్చి పడ్డాయని, అందుకే ఆయన అంతటి కఠిన నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చి ఉంటుందని తాను భావిస్తున్నట్లు చెప్పారు. వ్యక్తిత్వంలో గానీ, పనితీరులో గానీ.. నాయకత్వంలో గానీ కోడెలకు సరి తూగే నాయకుడు లేరని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఆయన ఆత్మహత్య చేసుకోవడం తనను తీవ్రంగా కలచి వేసిందని చెప్పారు.
తీవ్ర మానసిక క్షోభకు గురయ్యారు..
శుక్రవారం ఆయన అనంతపురం జిల్లాలో విలేకరులతో మాట్లాడారు. దురదృష్టవశావత్తూ ఈ మధ్యకాలంలో ఆయన కొన్ని అనూహ్య సంఘటనలను ఎదుర్కొన్నారని చెప్పారు. ఆయన తీవ్ర మానసిక క్షోభను అనుభవించారని, దానికి దారి తీసిన కారణాలేమిటనేది తనకు తెలియదని అన్నారు. ఈ బతుకు బతకడం ఒక్కటే చనిపోవడం ఒక్కటే అనేంతలా ఆయన నిరాశకు గురయ్యారని జేసీ చెప్పారు. డాక్టర్ గా గానీ, రాజకీయ నాయకుడిగా గానీ.. సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు సాధించుకున్న వ్యక్తి అని అన్నారు. కొన్ని దరిద్రమైన కారణాలు ఆయన నెత్తి మీదికి వచ్చి పడేటప్పటికీ.. ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చి ఉంటుందని చెప్పారు. ఈ సంఘటనను తాను ముందే ఊహించానని అన్నారు. ఏదో ఒకరోజు ఆయన ఆత్మహత్య చేసుకుంటారని అనుకున్నానని జేసీ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు.
మరిన్ని అవమానాల పాలు కాకుండా ఉండటానికే ఆత్మహత్య..
ఉన్నతమైన వ్యక్తిత్వం గల వ్యక్తి, మంచివాడిగా గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు, నిరంతరం ప్రజల్లో ఉండే కోడెల అర్ధాంతరంగా మరణించడం ఆవేదనకు గురి చేసిందని చెప్పారు. నెల, రెండు నెలలుగా ఆయన తీవ్ర మానిసక క్షోభను అనుభవించి ఉంటారో.. ఎవరంతకు వాళ్లు ఊహించాల్సిందే తప్ప.. ఎవరూ మాటల్లో వర్ణించలేరని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి.. చిన్న చిన్న కేసుల్లో ఇరుక్కుని అవమానాల పాలయ్యారని చెప్పారు. మరింత అవమానాల పాలు కావడం కంటే మరణించడం మేలు అని అనకోవడం వల్లే ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. పోలీసులు నమోదు చేసిన కేసుల వల్లే కోడెల ఆత్మహత్య చేసుకుని ఉంటారని తాను చెప్పట్లేదని జేసీ స్పష్టం చేశారు. మానసిక క్షోభకు గురి చేసిన కారణాలు అనేకం ఉండొచ్చని చెప్పారు. పోలీసుల పనితీరును కూడా తప్పుపట్టడానికి ఏమీ లేదని వ్యాఖ్యానించారు.
ప్రతి దానికీ కోర్టు దాకా..
కేసు నమోదు చేయడం.. నిందితుడిని కోర్టుకు తరలించడం వంటి చర్యలు చట్టపరంగా సరైనవేనని, అయినప్పటికీ.. వారు కొన్ని సందర్భాల్లో కర్ర పెత్తనం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కర్ర పట్టుకుని పోలీసులు చచ్చేంతగా కొట్టాల్సిన సందర్భం వచ్చినప్పుడు వారు అలాగే ప్రవర్తించాలని, ప్రతి దానికీ కోర్టు చుట్టూ తిరగడం సబబు కాదని అన్నారు. ప్రతి విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లాల్సి వస్తే.. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని జేసీ చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో అలాంటి పరిస్థితే నెలకొని ఉందని జేసీ వ్యాఖ్యానించారు. పెట్టీ కేసులను సైతం పోలీసులు కోర్టు దాకా తీసుకెళ్లడం సరి కాదని ఆయన కుండబద్దలు కొట్టారు. చాలా కేసును పోలీస్ స్టేషన్లలోనే పరిష్కరించేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.