జేసీ హల్చల్: దేశద్రోహం చేశానా..? రోజంతా నిర్బంధించారు, రియాక్షన్ తప్పదు, జగన్పై ఫైర్
వైసీపీ ప్రభుత్వంపై మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మండిపడ్డారు. జగన్ సర్కార్ దుర్మార్గపు పనులు చేస్తోందని విరుచుకుపడ్డారు. కక్షసాధింపు చర్యలు సరికాదని... యాక్షన్కు రియాక్షన్ ఉంటుందని స్పష్టంచేశారు. భయపెట్టి పాలించాలని చూడటం సరికాదని.. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని చెప్పారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలపై ఏపీ ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
జేసీ అనుచరుడి హల్చల్, కిరోసిన్ పోసుకుని నిప్పు, 6 గంటలుగా రూరల్ పీఎస్లోనే మాజీ ఎంపీ
రోజంతా పీఎస్లోనే..
పోలీసులతో బూట్లు నాకిస్తా అనే వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ముందస్తు బెయిల్ పత్రాలు తీసుకొని ఇవాళ ఉదయం అనంతపురం రూరల్ పోలీసు స్టేషన్కు జేసీ దివాకర్ రెడ్డి వచ్చారు. బెయిల్పై ష్యూరిటీ పరిశీలించాలని, ఇతర కారణాలు చెబుతూ పోలీసులు జేసీని పోలీసు స్టేషన్లో ఉంచారు. దాదాపు 8 గంటల పాటు ఆయన పీఎస్లోనే ఉండిపోయారు.
కార్యకర్త హల్చల్
అటు జేసీ పీఎస్లో ఉండగా తాడిపత్రి నుంచి ఆయన అభిమానులు చేరుకున్నారు. ఒక కార్యకర్త కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితి చేయిదాటడంతో రాత్రి 8 గంటల సమయంలో జేసీకి బెయిల్ ఇస్తున్నట్టు ప్రకటించి, వదిలేశారు.
పేషంట్ అని చెప్పినా..
తాను బీపీ, షుగర్ షేషంట్నని.. మందులు వేసుకోవాలని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. తానేం తప్పు చేశానని జగన్ ప్రభుత్వాన్ని అడిగారు. దేశద్రోహం చేశానా ? అందుకే నిర్బంధించారా అని ధ్వజమెత్తారు. పోలీసులపై వ్యాఖ్యలపై కోర్టు బెయిల్ తీసుకొస్తే రోజంతా నిర్బంధించారని మండిపడ్డారు. తనను ఎవరూ అరెస్ట్ చేయలేదని.. తానే స్వయంగా పోలీసు స్టేషన్కు వచ్చానని చెప్పారు.
ఏం జరిగిందంటే..
గతనెల 18వ తేదీన అనంతంపురంలో టీడీపీ నాయకుల సమావేశం జరిగింది. పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో జేసీ దివాకర్ రెడ్డి పోలీసులపై విరుచుకుపడ్డారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే పోలీసులతో బూట్లు నాకిస్తా అని వారిని కించపరుస్తూ మాట్లాడారు. ఎస్పీ, ఆ స్థాయి పైన అధికారులు గానీ, కింది స్థాయి అధికారులు టీడీపీ నేతలను పట్టించుకోవడం లేదని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. అనంతపురం ఎస్పీని ఉదహరిస్తూ.. మిగతా పోలీసుల వైఖరిపై కూడా జేసీ ఫైరయ్యారు. టీడీపీ అధికారంలోకి వస్తే వారి సంగతి చెబుతామని సభా వేదికనుంచి హెచ్చరించారు. వైసీపీ ఎమ్మెల్యేలకు కొందరు పోలీసులు వంగి వంగి దండాలు పెడుతున్నారని పేర్కొన్నారు.