చంద్రబాబు హయాంలో తాగునీరు లేదు .. మద్యం మాత్రం డోర్ డెలివరీ అవుతుందన్న లక్ష్మీ పార్వతి
వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి చంద్రబాబు నాయుడు పాలనపై మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు పాలనలో ప్రజలు తాగునీటికి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె అన్నారు. కానీ మద్యం మాత్రం ఏరులై పారుతుందని ఆమె మండిపడ్డారు.
ఇండియా టుడే ఆసక్తికర సర్వే... ఆ విషయంలో దేశంలో వైసీపీదే అగ్ర స్థానం
ఏపీలోని గుంటూరులో జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో మద్యపాన నిషేధంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ అప్పట్లో సంపూర్ణ మధ్యపాన నిషేధం అమలుచేస్తే మహిళలు అంతా సంతోషించారని లక్ష్మీపార్వతి గుర్తు చేశారు . కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో మద్యం డోర్ డెలివరీ స్థాయికి చేరుకుందని విమర్శించారు. చిన్న పిల్లలు సైతం మద్యానికి బానిసలుగా మారుతున్నారని, తల్లిదండ్రులు పిల్లలను కనిపెట్టకుంటే కష్టమని లక్ష్మీ పార్వతి చెప్పారు. అందరూ బాధ్యతా యుతంగా వ్యవహరిస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం సాధ్యం అవుతుందని లక్ష్మీ పార్వతి తెలిపారు.
ఓవైపు అనంతపురం జిల్లాలో ప్రజలు తాగునీరు లేకుండా అల్లాడిపోతున్నారని లక్ష్మీ పార్వతి ఆవేదన వ్యక్తం చేశారు . ఇక మరోవైపు జిల్లాలో మద్యం అమ్మకాలతో టీడీపీ ప్రభుత్వానికి రూ.244 కోట్ల ఆదాయం చేకూరిందని వ్యాఖ్యానించారు. వచ్చిన ఆదాయం అయినా ప్రజల తాగునీటి అవసరాలకు కేటాయిస్తారంటే అలాంటిది ఏమీలేదని ఆమె పేర్కొన్నారు. మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఖజానాలో వేసుకుందని దుయ్యబట్టారు. మద్యం అమ్మకాలపైన చూపిన శ్రద్ధ తాగునీటి వసతి కల్పించటంపై టీడీపీ ప్రభుత్వం చూపించటం లేదని లక్ష్మీ పార్వతి పేర్కొన్నారు .