ఎవరు అడ్డొచ్చినా ఫినిష్ ... రేపు అసెంబ్లీలో జరిగేదిదే .. జేసీ దివాకర్ రెడ్డి జోస్యం
రేపటి నుండి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఏం జరుగుతుందో ముందే జోస్యం చెప్పారు టిడిపి సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. ఎవరు ఎదురుపడినా ఫినిష్ చేయడమే వైసిపి లక్ష్యమని విమర్శలు గుప్పించిన ఆయన అసెంబ్లీలో రేపు ఏమీ జరగదు.అవసరమైతే టీడీపీ నేతలు బయటకు పంపేసి బిల్లులు పాస్ చేసుకుంటారు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసులు ఉన్నా లేకపోయినా టిడిపి నేతలను ఇబ్బంది పెట్టాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం అని జెసి దివాకర్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు.
అబద్ధాల శాఖకు బొత్సా మంత్రి .. నాడు జగన్ ను తిట్టిన నోటితోనే నేడిలా : మాజీ మంత్రి చినరాజప్ప కౌంటర్
ఏదో ఒక కేసు సృష్టించి లోపలేస్తారన్న జేసీ దివాకర్ రెడ్డి
జెసి ప్రభాకర్ రెడ్డి, అశ్విత్ రెడ్డి లపై ఎఫ్ఐఆర్ లో పేర్లు లేవని, అయినా అరెస్టు చేశారంటూ ఆయన మండిపడ్డారు. ఇక ఇప్పటి వరకు తనపై ఎలాంటి కేసులు లేవని, ఏదో ఒక కేసు సృష్టించి తనను కూడా లోపల పడేస్తారు అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కక్ష సాధింపు చర్యలను అనుభవించాల్సిందే అంటూ జెసి దివాకర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ అనుకున్నదే చేస్తారని ఆయన జగన్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు .
అక్రమంగా మా కుటుంబంపై కేసులు నమోదు చేశారన్న జేసీ
ఇక తమ కుటుంబంపై నారా లోకేష్ కు చాలా ప్రేమ ఉందని అందుకే ధైర్యం చెప్పటానికి వచ్చారని పేర్కొన్నారు జేసీ దివాకర్ రెడ్డి . వాహనాలు అమ్మిన వారిని, ఏజెంట్లను, రిజిస్ట్రేషన్ చేసిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా తామే అక్రమాలకూ పాల్పడినట్టు టార్గెట్ చేశారని ఆరోపించారు. అక్రమంగా మా కుటుంబంపై కేసులు నమోదు చేశారన్న ఆయన బెయిల్ పిటిషన్ వేస్తున్నామని, తప్పకుండా బెయిల్ వస్తుందని ఆశిస్తున్నాం అని పేర్కొన్నారు. సీఎం జగన్ పాలన పట్ల , వైసీపీ ప్రభుత్వ తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
నల్ల చొక్కాలతో అసెంబ్లీకి వెళ్లనున్న టీడీపీ ఎమ్మెల్యేలు
ఇక రెండు రోజులపాటు జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వాలని నిర్ణయం తీసుకున్న టీడీపీ ప్రభుత్వ తాజా నిర్ణయాలపై, ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన తెలియజేయడానికి ప్రతీకగా నల్ల చొక్కాలు ధరించి టిడిపి ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. ఒకపక్క రాష్ట్రంలో కరోనా పంజా విసురుతున్న సమయంలో రెండు రోజులపాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది వైసీపీ ప్రభుత్వం. ఇక ఈ సమావేశాల్లోనే బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టనుంది. తమ నిరసన తెలియజేయాలని, అసెంబ్లీ వేదికగా తమ గళం వినిపించాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని నిర్ణయం తీసుకుంది. ఇక పలు అంశాలపై ఇప్పటికే వ్యూహాత్మకంగా ప్రశ్నలు సంధించాలని సిద్ధమైన టిడిపి తమ పార్టీ నేతలు అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ పై గవర్నర్ కు వినతిపత్రం అందించాలని నిర్ణయం తీసుకున్నారు.
Recommended Video
తొలిసారిగా గవర్నర్ ఆన్ లైన్ ప్రసంగం.. కరోనా సమయంలో కఠిన ఆంక్షలు
ఇక రేపటి నుండి రెండు రోజులపాటు జరగనున్న అసెంబ్లీ సమావేశాలలో ఉదయం 10 గంటలకు గవర్నర్ ప్రసంగిస్తారు. దేశంలోనే తొలిసారిగా గవర్నర్ ఆన్లైన్ లో ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం బీఏసీ సమావేశంలో సభ ఎన్నిరోజులు జరపాలన్న నిర్ణయం తీసుకోనున్నారు. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో కరోనా కాలంలోనూ వైసిపి అందిస్తున్న సంక్షేమపథకాలను గురించి అసెంబ్లీ వేదికగా ప్రజలకు తెలియజేయాలని వైసీపీ నేతలు వ్యూహాలు రచిస్తోంది. ఇక టీడీపీ రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వ అరాచకాలను ఎండగట్టాలని,అసెంబ్లీలో బలంగా ప్రశ్నించాలని నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు వచ్చే ఎమ్మెల్యేలందరికీ పరీక్షలు నిర్వహించడమే కాకుండా, వాహన రాకపోకలు విషయంలో కూడా కఠిన నిబంధనలు అమలు చేయనున్నారు. ఇక మీడియాకు సైతం అసెంబ్లీ సమావేశాలలో రాకుండా ఆంక్షలు విధించారు .