ఇది బీజేపీకే ప్లస్: చంద్రబాబుకు భారీ షాకిచ్చిన జేసీ దివాకర్ రెడ్డి, అందుకే అలా అన్నారా?
అనంతపురం: తెలుగుదేశం పార్టీ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి శనివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో అధినేత నారా చంద్రబాబు నాయుడుకు షాకిచ్చారు. ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్తో యుద్ధం వచ్చినా, యుద్ధ వాతావరణం కొనసాగినా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ విజయం ఖాయమన్నారు.
బీజేపీకి కలిసి వస్తుంది
యుద్ధ వాతావరణం ఉంటే మన దేశం, మన రక్షణ అనే భావన తెరపైకి వస్తుందని జేసీ చెప్పారు. అలాంటి పరిస్థితి బీజేపీకి కలిసి వస్తుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 40 శాతం మందిని మార్చకపోతే మళ్లీ సీఎం అయ్యేందుకు చంద్రబాబు నాయుడుకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ఆయన చేపడుతున్న పథకాలకు అనుగుణంగా పేరుతెచ్చే స్థాయిలో ఎమ్మెల్యేలు ఎవరూ పని చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
చంద్రబాబును చూసి ఓటేయరు
తనను చూసి జనం ఓట్లేస్తారని భ్రమల్లో చంద్రబాబు ఉన్నారని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చకుంటే ఆయనకు కష్టమేనని చెప్పారు. ఎమ్మెల్యేలను మారిస్తేనే మరోసారి చంద్రబాబు రాజ్యం వస్తుందని చెప్పారు. ఏపీలో ఉన్న 175 నియోజకవర్గాల్లోని ప్రజలు.. చంద్రబాబును చూసే కాకుండా తమ ఎమ్మెల్యేను కూడా పరిగణనలోకి తీసుకుంటారని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రభాకర్ చౌదరిని టార్గెట్ చేశారా?
కాగా, అనంతపురం లోకసభ స్థానం నుంచి ఈ ఎన్నికల్లో తన తనయుడు జేసీ పవన్ కుమార్ రెడ్డిని బరిలోకి దించాలని జేసీ దివాకర్ రెడ్డి భావిస్తున్నారు. అయితే, అనంతపురం లోకసభ పరిధిలోకి అనంతపురం అసెంబ్లీ సెగ్మెంట్ కూడా వస్తుంది. కానీ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి, జేసీ దివాకర్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. చంద్రబాబు హెచ్చరించినా నేతల మధ్య సర్దుబాటు లేదు. ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలని జేసీ దివాకర్ రెడ్డి కామెంట్స్ చేయడం గమనార్హం. ప్రభాకర్ చౌదరిని టార్గెట్గా చేసుకునే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నారు.