జేసీ పవన్ ఓవరాక్షన్.. 30 యాక్ట్ అమల్లో ఉన్నా ర్యాలీ.. 15 మంది వరకు అరెస్ట్..
కరోనా వైరస్ కొన్ని చోట్ల కర్ఫ్యూ విధిస్తున్నారు. మరికొన్ని చోట్ల జనం గుమిగూడొద్దని అంటున్నారు. 30 యాక్ట్ అమలు చేస్తున్నారు. జన సమూహం ఉండొద్దని చిలుకకు చెప్పినట్టు చెబుతున్నారు. కానీ కొందరు చెవికి ఎక్కించుకోవడం లేదు. ఇవాళ అనంతపురంలో కూడా ఇలాంటి ఘటన జరిగింది. టీడీపీ యువనేత జేసీ పవన్ రెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారు.
టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి తనయుడు జేసీ పవన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. '30 యాక్ట్' అమల్లో ఉన్నా జేసీ పవన్ బైక్ ర్యాలీ తీశారు. ర్యాలీకి అనుమతి లేదని స్పష్టం చేశారు. అయినా జేసీ వర్గీయులు వినిపించుకోలేదు కదా.. దురుసుగా ప్రవర్తించారు. పోలీసు జీపులపై ఎక్కి హంగామా సృష్టించారు. నిబంధనలను బేఖాతరు చేశారని జేసీ పవన్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నామని పోలీసులు తెలిపారు. 30 యాక్ట్ అమలులో ఉందని హెచ్చరికలు జారీ చేశామని.. కానీ జేసీ పవన్ పెడ చెవిన పెట్టారని తెలిపారు. ఇప్పుడే కాదు ఇదివరకు కడపలో నిబంధనల ఉల్లంఘన కేసు నమోదయ్యింది. తాడిపత్రి పోలీస్స్టేషన్ పరిధిలో కూడా పలు కేసులు ఉన్నాయి.
Recommended Video
డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు జేసీ పవన్ కుమార్ రెడ్డి సహా 15 మందిని అరెస్ట్ చేశామని అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి వెల్లడించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదన్నారు. కోవిడ్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని ఆయన స్పష్టంచేశారు.