కడప జైలుకు జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి.. కస్టడీ నుంచి జైలుకు, కోర్టులో జేసీ భార్య పిటిషన్
వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిని పోలీసులు తిరిగి కడప జైలుకు తరలించారు. ఫోర్జరీ డాక్యుమెంట్లకు సంబంధించి పోలీసు కస్టడీ ముగియడంతో సోమవారం అనంతపురం నుంచి తీసుకెళ్లారు. ఉదయం ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేశారు. తర్వాత కోర్టులో హాజరుపరచగా.. తిరిగి వారిని జైలుకు తరలించాలని మేజిస్ట్రేట్ ఆదేశించారు.
Recommended Video
వీరిద్దరీని కడప జైలు నుంచి శనివారం కస్టడీకి తీసుకున్నారు. అనంతపురం వన్ టౌన్ పోలీసు స్టేషన్లో విచారించారు. బీఎస్-3 వాహనాలు, బీఎస్-4గా ఎలా రిజిస్ట్రేషన్ చేశారు.., క్లియరెన్స్ సర్టిఫికెట్ ఎలా సృష్టించారనే అంశంపై ప్రశ్నించారు. ఎవరి ప్రమేయంతో జరిగింది...? వెనక ఎవరు ఉన్నారనే అంశంపై సుదీర్ఘంగా ప్రశ్నించారు. వాహనాల కొనుగోలు కోసం ఎవరూ వెళ్లారు.. ? ఏ కంపెనీ పేరుతో కొనుగోలు చేశారనే అంశంపై ప్రశ్నల వర్షం కురిపించారు.
ఫోర్జరీ డాక్యుమెంట్స్ కేసులో ఈ నెల 13వ తేదీన ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి శంషాబాద్లోని ఇంటివద్ద ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించింది. కేసు విచారణ కోసం శనివారం అదుపులోకి తీసుకొని.. సోమవారం కోర్టులో ప్రవేశపెట్టారు. తిరిగి కడప జైలుకు తరలించాలని కోరగా.. వారిని తీసుకెళ్లారు.
జేసీ భార్య ఉమా తన భర్త, కుమారుడిపై ప్రభుత్వం అక్రమంగా కేసులు మోపారని, వారిపై నమోదు చేసిన కేసును రద్దు చేస్తూ కోర్టు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ కూడా దాఖలు చేశారు.