జైలులోనూ జగన్ వేధింపులు, అన్నం పెట్టకుండా ఒత్తిళ్లు - జేసీ సంచలనం - మెడకు మరో మూడు కేసులు..
ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, అనంతపురం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మెడకు మరిన్ని కేసులు బిగుసుకున్నాయి. జైలు నుంచి విడుదలైన 24 గంటల్లోనే ఆయనపై కొత్తగా మూడు కేసులు నమోదయ్యాయి. వాటిలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా ఉంది. అయితే, తనపై కేసులు పూర్తిగా రాజకీయ ప్రేరితమైనవన్న జేసీ.. తాను జైలులో ఉన్నప్పుడు కూడా సీఎం జగన్ వేధింపులు ఆపలేదని, లోపల కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
కిమ్ దేశం కకావికలం: ఐదేండ్ల తర్వాత అక్కడికి నియంత నేత - పొరుగున సౌత్, చైనాలోనూ ఆగమాగం
24 గంటల్లోనే మరో మూడు..
దివాకర్ ట్రావెల్స్ కు సంబంధించిన వాహనాల రిజిస్ట్రేషన్లలో అక్రమాల ఆరోపణలపై అరెస్టయిన జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిలు గురువారం సాయంత్రం కడప జైలు నుంచి విడుదలయ్యారు. నిజానికి వీళ్లు అనంతపురం ఖైదీలే అయినప్పటికీ, కరోనా పరిస్థితుల నేపథ్యంలో కడపకు తరలించారు. రాత్రి సమయంలో జేసీ తండ్రీతనయులు భారీ ర్యాలీగా తాడిపత్రిలోని ఇంటికి చేరుకున్నారు. అయితే, ర్యాలీ వల్ల ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతోందంటూ అభ్యంతరం చెప్పిన తాడిపత్రి సీఐ దేవేందర్ పట్ల జేసీ దివాకర్ రెడ్డి దురుసుగా వ్యవహరించినట్లు వీడియోలూ వైరల్ అయ్యాయి. ఈ వ్యవహారానికి సంబంధించి అనంతపురం జిల్లా పోలీసులు జేసీపై కొత్తగా మూడు కేసులు నమోదు చేశారు. వాటిలో ఒకటి ఎస్సీ,ఎస్టీ అట్రాసీటి కింద ఉండటం గమనార్హం. తద్వారా జైలు నుంచి విడుదలై 24 గంటలు తిరక్కముందే ఆయన మెడకు మళ్లీ కేసులు చుట్టుకున్నట్లయింది. ఈ వ్యవహారంపై జేసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తప్పు దొరికితే ఉరి తీయండి..
రాజకీయ వేధింపుల్లో భాగంగానే తనపై కేసులు పెడుతున్నారన్న జేసీ ప్రభాకర్ రెడ్డి.. వాహనాల రిజిస్ట్రేషన్ల విషయంలో తానుగానీ, తన కొడుకుగానీ ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, ఒకవేళ తప్పు చేసినట్లు రుజువైతే తమను ఉరి తీసినా అందుకు సమ్మతమేనని అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. వాహనాల ఇంజిన్, చాయిస్ నెంబర్ల ద్వారా వివరాలు రాబట్టొచ్చని, నాగాలాండ్లో రిజిస్ట్రేషన్ రూల్స్ వేరేగా ఉన్నాయని, ఈ విషయంలో తాము ఏజెంట్ల చేతిలో మోసపోయామని, అయినప్పటికీ డాక్యుమెంట్లలో ఎక్కడా తాము సంతకాలు చేయలేదని జేసీ స్పష్టం చేశారు. దివాకర్ ట్రావెల్స్ బస్సులు మళ్లీ తిప్పే పరిస్థితి లేదని, ఏపీఎస్ఆర్టీసీ పరిస్థితి కూడా దారుణంగా తయారైందని ఆయన చెప్పారు.
జైలులో అన్నం పెట్టకుండా..
‘‘కేవలం రాజకీయ విభేదాల వల్లే జేసీ కుటుంబాన్ని టార్గెట్ చేశారు. మిగతా నేతల్లాగా మేము కూడా సీఎం జగన్ కు దండం పెడితే ఇన్ని ఇబ్బందులు ఉండేవేకావు. జైలులో ఉన్నప్పుడు కూడా జగన్ తన కక్ష సాధింపును వదల్లేదని అనిపించింది. మాకు అన్నం పెట్టకుండా జైలు అధికారులపై ఒత్తిడి పెంచారు. అయితే, ఏ తప్పూ చేయలేదు కాబట్టి మేం ఎవరికీ భయపడే ప్రసక్తేలేదు. టీడీపీని విడాలన్న ఆలోచన అసలే లేదు. ఏది ఏమైనా టీడీపీలో ఉండే జగన్ సర్కారుపై పోరాటాన్ని కొనసాగిస్తాం..''అని ప్రభాకర్ రెడ్డి తెలిపారు.
నాడు ఎన్టీఆర్.. నేడు వైఎస్ జగన్..
‘‘అధికారంలో ఉన్నవాళ్లు కేవలం కక్ష సాధింపులు, రాజకీయాలే చేయాలనుకుంటే ఏదైనా చేయగలరు. అవతలివాళ్లపై ఎన్నైనా అక్రమ కేసులు పెట్టగలరు. వాటికి పెద్ద కారణాలు కూడా అవసరం లేదు. నా పట్ల గతంలో ఎన్టీఆర్, ఇప్పుడు వైఎస్ జగన్ అదే ధోరణి అనుసరించారు. ఎన్టీఆర్ హయాంలో నన్ను 11 రోజులు జైల్లో వేశారు. ఇప్పుడు జగన్ హయాంలో 54 రోజులు జైల్లో ఉంచారు. దేన్నైనా ఎదుర్కొనే ధైర్యం మాకుంది''అని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ర్యాలీలో తాడిపత్రి సీఐని దూషించాననడం అవాస్తవమని, తాజా కేసులు కూడా పాత లాంటివేనని ఆయన వ్యాఖ్యానించారు.
Recommended Video
జేసీపై కడపలోనూ కేసుల పర్వం..
జైలు నుంచి విడుదలైన సందర్భంగా టీడీపీ శ్రేణులు చేపట్టిన ర్యాలీకి సంబంధించి జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిలపై అనంతపురం జిల్లాతోపాటు కడపలోనూ కేసుల పరంపర కొనసాగుతున్నది. కడప జైలు వద్ద కరోనా నిబంధనలు ఉల్లంఘించారంటూ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్, జేసీ పవన్ సహా 31 మంది టీడీపీ నేతలు, కార్యకర్తలపై కడప పోలీసులు శుక్రవారం కేసులు నమోదు చేశారు. తాడిపత్రి సీఐ సీఐ దేవేందర్ ను దూషించిన వ్యవహారంలో జేసీ కుటుంబంపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీసహా మూడు కేసులు నమోదయ్యాయి.